అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. చికెన్ బిర్యానీ దొరక్కపోవడంతో ఒక వ్యక్తి రెస్టారెంట్ కు నిప్పు పెట్టాడు. ఈ మొత్తం సంఘటన రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. దాని ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. ఈ వీడియోలో నిందితుడు నిప్పు పెట్టడం చూడవచ్చు.


నిందితుడి 49 ఏళ్ల చోఫెల్ నోర్బుగా గుర్తించారు పోలీసులు. న్యూయార్క్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. చోఫెల్ నగరంలోని జాక్సన్ హైట్స్ ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశీ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తినడానికి వచ్చాడని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అతను తాగిన మైకంలో ఉన్నందున రెస్టారెంట్ సిబ్బంది తనకు చికెన్ బిర్యానీ ఇవ్వలేదని అసహనంతో రగిలిపోయాడు. అది కాస్త కోపంగా మారింది. అందుకే రెస్టారెంట్ యజమానికి గుణపాఠం చెప్పాలని భావించి ఇలా చేశాడు. తర్వాత రోజు రాత్రి రెస్టారెంట్‌కు వచ్చి నిప్పు పెట్టాడు. 






తెల్లావరి యజమాని వచ్చి హోటల్ చూసే సరికి పొగ కనిపించింది. ఏం జరిగిందో అని కంగారు పడ్డాడు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి చోఫెల్‌గా గుర్తించారు. అతన్ని అరెస్టు చేశారు. బిర్యాని ఇవ్వలేదని రెస్టారెంట్‌కు నిప్పు పెట్టిన ఆ వ్యక్తి ఇప్పుుడు జైల్లో ఖైదీల ఫుడ్ తింటున్నాడు. అందుకే  బిర్యానీ కావాలంటే ఆర్డర్‌ పెట్టుకోవచ్చు కదా బ్రో... ఎందుకిలా చేశావంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.