US-Iran War: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌కు విధించిన గడువు ముగియడానికి ముందే ఇరాన్‌ చమురు ఎగుతులకు గుండెకాయ వంటి ఖర్గ్ ద్వీపంపై అమెరికా సైన్యం భారీ దాడులకు దిగింది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఈ దాడులలో ఖర్గ్‌ ద్వీపంలోని 50కిపైగా లక్ష్యాను అమెరికా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ ప్రభుత్వానికి కఠినమైన గడువును విధించారు. వాషింగ్టన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని, అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ గడువు ముగియడానికి కేవలం కొన్ని గంటల సమయం ఉండగానే అమెరికా తన వైమానిక ఫోర్స్‌ను ఉపయోగించింది. ఈ ఆదేశాలను పాటించని పక్షంలో ఇరాన్‌లోని ప్రతి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, వంతెనలను లక్ష్యంగా చేసుకొన భారీ బాంబు దాడులు చేస్తామని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. 

ఖర్గ్‌ ద్వీపం ప్రాముఖ్యత

ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో ఖర్గ్ ద్వీపం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఇరాన్ దేశం చేసే మొత్తం చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతాయి. ఇరాన్ ప్రధాన భూభాగంలోని తీర ప్రాంతాలు పెద్ద చమురు ట్యాంకర్ల రాకపోకలకు అనువైన లోతును కలిగి ఉండవు. అందుకే ఖర్గ్‌ ద్వీపం ఆ దేశానికి ఇంధన వాణిజ్యంలో అనివార్యమైన కేంద్రంగా మారింది. కువైట్, సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలకు ఎదురుగా ఉన్న ఈ ద్వీపం, భౌగోళికంగా కూడా యుద్ధ సమయంలో సులభంగా లక్ష్యం చేసుకోగలిగే స్థితి ఉంది. 

దాడుల తీవ్రత 

అమెరికా సైన్యం ఖర్గ్‌ ద్వీపంలోని సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించినట్టు సీనియర్ అమెరికా అధికారి ఒకరు ధృవీకరించారు. వాల్‌స్ట్రీట్ జర్న్‌ కథనం ప్రకారం 50కిపైగా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయి. అయితే అెమరికా వైస్ ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్‌ ఈ దాడులపై స్పందిస్తూ ఇది అమెరికా వ్యూహంలో మార్పు ఏం కాదని, కేవలం సైనిక లక్ష్యాలను  మాత్రమే దెబ్బ తీశామని స్పష్టం ేశారు. ఈ దాడుల వల్ల చమురు మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం కలగలేదని రాయిటర్స్ సంస్థ పేర్కొంది. 

ఇదే సమయంలో ఇజ్రాయెల్ సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఇరాన్ అంతటా ఉన్న డజన్లు కొద్దీ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని తాము భారీ స్థాయిలో దాడుల పూర్తిగా చేసినట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇరాన్ ఉగ్రవాద పాలనకు వ్యతిరేకంగా ఈ చర్యలు చేపట్టినట్టు ఇజ్రాయెల్ రక్షణ దళం పేర్కొన్నప్పటికీ, ఆ లక్ష్యాల వివరాలు పూర్తిగా వెల్లడించలేదు. 

గతంలోనే ట్రంప్ హెచ్చరిక 

డొనాల్డ్ ట్రంప్ గత కొంత కాలంగా ఖర్గ్‌ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం లేదా ధ్వంసం చేయడం గురించి సోషల్ మీడియాలో పదే పదే హెచ్చరించారు. మార్చి 30న ఆయన ఒక పోస్ట్‌లో పేర్కొంటూ, ఇరాన్ దారికి రాకపోతే వారి విద్యుత్ కేంద్రాలు, చమురు బావులతో పాటు ఖర్గ్‌ ద్వీపాన్ని పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించారు. 

ప్రస్తుతం హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై పటిష్టమైన సైనిక ఒత్తిడిని పెంచుతుండటంతో రాబోయే గంటలు ప్రపంచ శాంతికి అత్యంత కీలకంగా మారాయి. 

భారత్‌ కూడా ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులు రాబోయే 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ , సైనిక ప్రాంతాలకు దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సలహా ఇచ్చింది.