అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుదవారం ఇజ్రాయెల్ లో పర్యటించనున్నారు. హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్‌ మద్దతు ప్రకటించారు జో బైడెన్. హమాస్ పై దాడులకు కావాల్సిన సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కు వెళ్తున్న బైడెన్, భవిష్యత్ లో చేపట్టాల్సిన చర్యలపైనా ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుతో చర్చించనున్నారు. ఇజ్రాయెల్ తర్వాత అక్కడి నుంచి అధ్యక్షుడు జోర్డాన్‌ రాజధాని అమ్మన్‌కు వెళ్లనున్నారు. అక్కడ జోర్డాన్‌ రాజు అబ్దుల్లా, ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతే అల్‌- సిసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌తో సమావేశమవుతారు. పాలస్తీనా ప్రజల గౌరవం, స్వీయనిర్ణయాధికారాన్ని హమాస్ ప్రతిబింబించదని బైడెన్‌ చెప్పనున్నట్లు తెలుస్తోంది. గాజాలోని మానవతా సంక్షోభ నివారణపై చర్చలు జరపనున్నారు. మరోవైపు హమాస్‌తో ఇజ్రాయెల్‌ పోరు తీవ్రమవుతున్న నేపథ్యంలో, తమ సైనికులను అమెరికా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని రెండు వేల మంది సైనికులను పెంటగాన్‌ ఆదేశించింది. వీరిని వైద్యం, లాజిస్టిక్స్‌, సరిహద్దుల వద్ద అదనపు భద్రత వంటి విభాగాల్లో పని చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.  ఇజ్రాయెల్‌ సైనికులకు మద్దతుగా సరిహద్దుల్లో అమెరికా సైనికులు మోహరించే అవకాశం ఉంది. 


ఆహారం, నీళ్లు లేక కష్టాలు


హమాస్‌ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ భీకరంగా వైమానిక దాడులు చేస్తోంది. ఆహారం, నీళ్లు లేక గాజా వాసులు అలమటిస్తున్నారు. నీరు, విద్యుత్తు, నిత్యవసరాలు, ఆసుపత్రుల్లో మందులు, వైద్య సామగ్రి నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఈ ఆందోళనకర పరిణామాల నేపథ్యంలో మాట్లాడిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, గాజాకు మానవతా సాయం అందించేందుకు అనుమతిస్తామన్నారు. హమాస్‌ మిలిటెంట్లు అపహరించిన తమదేశ పౌరులను తిరిగి తీసుకొచ్చే విషయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.  ఐసిస్ వంటి హమాస్‌ ఉగ్రసంస్థను అణచివేసేందుకు ప్రపంచమంతా ఒక్కటవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ముప్పు కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. న్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దంటూ ఇరాన్‌తోపాటు హిజ్బుల్లాను హెచ్చరించారు. లెబనాన్‌ సరిహద్దులో ఇజ్రాయెల్‌ అమర్చిన సెక్యూరిటీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించడంపై నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిజ్బుల్లా బలగాలు ఇప్పటికే ఇజ్రాయెల్‌పై పలుమార్లు రాకెట్‌ దాడులకు పాల్పడ్డాయి. ఇజ్రాయెల్‌ సైతం లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై దాడులు చేపడుతోంది. 


హిజ్బుల్లా వద్ద లక్షకుపైగా రాకెట్లు
హిజ్బుల్లా వద్ద ఊహించని విధంగా ఆయుధాలు ఉన్నట్లు ఇజ్రాయెల్‌ నిఘావర్గాల అంచనా వేస్తుననాయి. ప్రస్తుతం ఆ సంస్థ వద్ద లక్షకు పైగా రాకెట్లు ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ను తొలగించి పాలస్తీనాను స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడమే హిజ్బుల్లా అంతిమలక్ష్యం. హమాస్ ఉగ్రదాడి తర్వాత కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్‌ భూభాగంపై ప్రయోగించింది. తేరుకున్న ఇజ్రాయెల్, హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. 1980ల్లో లెబనాన్‌లో హిజ్బుల్లా ఏర్పాటయింది. రాజకీయంగానూ, మిలటరీపరంగానూ బలంగా ఉంది. ఒక్క రాకెట్లే కాదు, స్వల్పలక్ష్యాలను ఛేదించే క్షిపణులు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. హమాస్‌ మిలిటెంట్లతో పోలిస్తే వీరి సంఖ్య చాలా ఎక్కువ. దాదాపు లక్షకుపై క్రియాశీల బలగాలు ఉన్నట్టు పాశ్చాత్య నిఘావర్గాలు చెబుతున్నాయి.