పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల దాడులను ఖండించారు. హమాస్‌ చర్యలు పాలస్తీనాను అద్దం పట్టవన్నారు. హమాస్‌ చేసే దురాగతాలతో పాలస్తీనా ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ విధివిధానాలే దేశాన్ని ప్రతిబింబిస్తాయని గుర్తు చేశారు. ఇజ్రాయెల్‌, హమాస్‌ పరస్పర దాడుల్ని, అమాయక ప్రజల ప్రాణాలు తీయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇరు వర్గాలు బందీలుగా ఉన్న పౌరులు, ఖైదీలను విడుదల చేయాలని అబ్బాస్‌ కోరారు. 


హమాస్‌ దాడులతో ఇజ్రాయెల్‌ రక్తసిక్తమైంది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఇజ్రాయెల్‌ పౌరుల్ని బందీలుగా చేసుకున్నారు. దీంతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం, ఇంటెలిజెన్స్‌ వైఫల్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. దేశ పౌరులకు భద్రత కల్పించడంలో జాతీయ నాయకత్వం, భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలమయ్యాయని తెలిపింది. తమ తప్పును తలవంచుకొని ఎంతో బాధతో, నిజాయతీగా ఒప్పుకుంటున్నామని రక్షణ శాఖ తెలిపింది. 


సరిహద్దులకు 3లక్షల రిజర్వ్ బలగాలు
ఇజ్రాయెల్‌ తమ దేశంలోని 3 లక్షల మంది రిజర్వ్ బలగాలు గాజా సరిహద్దుకు తరలించింది. వారితోపాటు 1,70,000 మంది సైనికులనూ మోహరించింది. మరోవైపు హమాస్‌కు 30,000 మంది ఫైటర్లు ఉన్నారు. అంటే రిజర్విస్టు బలగాల్లో దాదాపు 10శాతం అన్నమాట. వారికి యుద్ధ ట్యాంకులుగానీ, వైమానిక దళంకానీ లేవు. ఇజ్రాయెల్‌కున్న బలంతో గాజాను ఆక్రమించుకోవడం పెద్ద కష్టం కాదు. అర్బన్‌ సెంటర్‌, గాజా సిటీలను సులభంగా సాధించగలదు. హమాస్‌ కూడా పోరాడటానికి సిద్ధంగా ఉంది. తనకున్న సొరంగాలతో ఇజ్రాయెల్‌ బాంబు దాడుల నుంచి ఫైటర్లను కాపాడుకునే శక్తి ఉంది. గాజా ప్రపంచంలోనే అత్యధిక జన సాంద్రత కలిగిన నగరాల్లో ఒకటి. ఇది హమాస్‌ ఫైటర్లకు ఉపకరించనుంది. ప్రజల మాటున మిలిటెంట్లు పోరాడటానికి అవకాశం ఉంటుంది. ప్రతి భవనమూ వారికి రక్షణ కవచమే. ఒకవేళ హమాస్‌ గాజాలో మందు పాతరలను పెడితే వాటిని దాటుకుని వెళ్లడం ఇజ్రాయెల్‌ సైన్యానికి కత్తిమీద సామే. అందుకే ఉత్తర గాజాలోని ప్రజలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది.


నెతన్యాహుకు బైడెన్ ఫోన్
ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధంతో గాజాలో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌తో  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్‌లో మాట్లాడారు. గాజాలో మానవతా సంక్షోభాన్ని నివారిద్దామని, సామాన్య ప్రజలకు సహాయం కొనసాగించేందుకు అనుమతించాలని విన్నవించారు. ఇందుకోసం ఐక్యరాజ్య సమితి, ఈజిప్టు, జోర్డాన్‌లతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని సూచించారు. ఘర్షణ మరింత విస్తరించకుండా చూడాలని ఇరువురు నేతలకు తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి తర్వాత నెతన్యాహుతో బైడెన్‌ ఫోన్‌లో మాట్లాడటం ఇది ఐదోసారి. హమాస్‌ దాడుల తర్వాత అబ్బాస్‌తో సంభాషించడం మాత్రం తొలిసారి. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్‌ తాజా దాడులను చైనా తప్పుబట్టింది. ఆత్మరక్షణ పరిధికి మించి ఇజ్రాయెల్‌ విధ్వంసానికి పాల్పడుతోందని విమర్శించింది. శాంతి చర్చలు జరపాలని, వెంటనే దాడులను ఆపేయాలని సూచించింది.