ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు ఐరోపా నేతలు. ఐరోపా సమాఖ్యకు చెందిన నేతలు, మాజీ నాయకులు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీకి మార్చి11న లేఖ రాశారు.


గడువు ముగిసినా


2022కు సంబంధించి నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్స్ పంపే గడువు ముగిసింది. అయినప్పటికీ జెలెన్‌స్కీకి నోబెల్ బహుమతి అందించేందుకు నామినేషన్ల గడువును ఈనెల 31 వరకు పొడిగించాలని ఐరోపా నేతలు కోరారు.


తమ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అయితే, ఈ ప్రతిపాదనను నార్వేజియన్ నోబెల్ కమిటీ అంగీకరిస్తుందో లేదో చూడాలి. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి 92 సంస్థల నుంచి 251 నామినేషన్లు వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్ 3-10 మధ్య నోబెల్ బహుమతుల్ని ప్రకటిస్తారు.


రష్యాను దీటుగా


రష్యా చేస్తోన్న దాడులను అధ్యక్షుడు జెలెన్‌స్కీ నేతృత్వంలోని ఉక్రెయిన్ దీటుగా ఎదుర్కొంటోంది. అయితే ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ భావోద్వేగ వీడియోను పోస్ట్‌ చేశారు.





దాడులకు ముందు ఉక్రెయిన్‌ ఎలా ఉందో.. ఇప్పుడు ఎంతటి భయానక పరిస్థితుల్లో చిక్కుకుందనేది ఆ వీడియో కళ్లకు కడుతోంది. బాంబు దాడిలో మంటల్లో ధ్వంసమైన భవనాలు, మరియుపోల్‌ ప్రసూతి ఆసుపత్రి వద్ద రోగుల ఆర్తనాదాలు, తల్లిదండ్రులను విడిచి పొరుగు దేశానికి ఏడుస్తూ వలస వెళ్తోన్న చిన్నారుల దుస్థితి, దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వందల మంది పౌరుల సామూహిక ఖననాల వంటి హృదయ విదారక దృశ్యాలు కలచివేస్తున్నాయి.


Also Read: ISKCON Temple Attack: ఇస్కాన్ మందిరంపై 200 మంది దాడి- ధ్వంసం చేసి లూటీ


Also Read: Shree Saini: ముఖం కాలిపోయింది, గుండె జబ్బు వేధిస్తోంది, అయినా మిస్ వరల్డ్ పోటీల్లో నిలిచి గెలిచింది