టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పంపిన ప్రత్యేక అంబాసిడర్ స్టీవ్ విట్‌కాఫ్‌తో జరిగిన సంభాషణకు సంబంధించిన ఆసక్తికర వివరాలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వెల్లడించారు. ఆ సమయంలో వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారిందని తెలిపారు. చర్చల సందర్భంగా అరాఘ్చీ, విట్‌కాఫ్‌ను ఉద్దేశించి ‘ఏ క్షణంలోనైనా బాంబు దాడి జరిగే ముప్పు పొంచి ఉన్న ఇలాంటి ఉత్కంఠభరిత వాతావరణంలో మీరు ఎప్పుడైనా చర్చల్లో పాల్గొన్నారా?" అని ప్రశ్నించానని పేర్కొన్నారు. అమెరికా బెదిరింపులకు ఇరాన్ ఎంతమాత్రం భయపడదని ఆయన స్పష్టం చేశారు. ఒక వ్యక్తి (లీడర్)ని పట్టుకోగానే మిగతా వారంతా భయపడి వెనక్కి తగ్గడానికి ‘ఇది వెనిజులా కాదు’ అంటూ ఆయన విట్‌కాఫ్‌కు ఘాటైన సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.

Continues below advertisement

దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో అధికార మార్పిడి కోసం అమెరికా చేపట్టిన సైనిక చర్యలను ప్రస్తావిస్తూ, ఇరాన్ ఆ విధంగా ఎప్పటికీ మోకరిల్లబోదని అరాఘ్చీ స్పష్టం చేశారు. అయితే, విట్‌కాఫ్‌తో జరిగిన ఈ సంప్రదింపులను అధికారిక చర్చలుగా భావించలేదని ఇరాన్ పేర్కొంది. గతంలో ఇరు దేశాల మధ్య అణు చర్చల సమయంలోనే ఈ ఇద్దరు నేతల మధ్య సంబంధాలు మొదలయ్యాయి. అప్పటి నుండి పాకిస్తాన్, స్విట్జర్లాండ్ సహా వివిధ దేశాల రాజధానులలో వీరి మధ్య పలు రౌండ్ల చర్చలు జరిగాయి.

పలు దేశాల్లో చర్చలు.. ఫలితం ఇవ్వని ప్రయత్నాలు

Continues below advertisement

గత ఏడాది ప్రారంభమైన ఈ చర్చల పరంపరలో మొదటి రౌండ్ ఫిబ్రవరి 6న మస్కట్‌లో పరోక్ష పద్ధతిలో జరిగింది. ఇందులో ఒమన్ మధ్యవర్తులు ఇరు ప్రతినిధి బృందాల మధ్య సమన్వయం చేయగా, చివర్లో నేరుగా ఒక సమావేశం జరిగింది. ఆ తర్వాత మస్కట్, రోమ్ నగరాలలో 3 రౌండ్ల చర్చలు జరిగాయి. ఐదో రౌండ్ ఐరోపాలో జరగాల్సి ఉండగా, అనంతరం వీరిద్దరూ జెనీవాలో భేటీ అయ్యారు. ఆ తర్వాత యుద్ధం ప్రారంభం కావడంతో, ఏప్రిల్‌లో పాకిస్థాన్ అధికారుల మధ్యవర్తిత్వంతో విట్‌కాఫ్, జరెడ్ కుష్నర్‌లతో సమావేశం కావడానికి అరాఘ్చీ పాక్ లోని ఇస్లామాబాద్, ఆ తరువాత రష్యాలోని మాస్కోలలో పర్యటించారు. ఈ అధికారిక పర్యటనలతో పాటు వీరిద్దరూ నేరుగా టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా సమాచారాన్ని మార్పిడి చేసుకునేందుకు ఒక ప్రత్యేకమైన ఛానల్‌ను కూడా కొనసాగించారు.

అమెరికాకు చెందిన MQ-9 డ్రోన్‌ను కూల్చినట్లు  IRGC ప్రకటన 

మిడిల్ ఈస్ట్‌లో అమెరికాతో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆదివారం (19 జూలై) ఒక పెద్ద ప్రకటన చేసింది. ఇరాక్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఖుజెస్తాన్ ప్రాంతంలోని అహ్వాజ్ సిటీలో తాము అమెరికాకు చెందిన ఒక MQ-9 డ్రోన్‌ను అడ్డుకుని కూల్చివేసినట్లు ఐఆర్‌జీసీ క్లెయిమ్ చేసింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ద్వారా ఐఆర్‌జీసీ ఈ వివరాలను పంచుకుంది.

ఇరాన్ తరఫున ఈ ప్రకటన వెలువడిన సమయం చూస్తే, అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్/CENTCOM) ఇరాన్‌లోని పలు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున సైనిక ఆపరేషన్లను నిర్వహించిన సమయంలో ఇది జరిగింది. ఇరాన్ పరిధిలో టెహ్రాన్ మద్దతు ఉన్న సౌకర్యాలకు వ్యతిరేకంగా అమెరికా సైన్యం గత 8 రాత్రులుగా నిరంతరాయంగా కొనసాగిస్తున్న చర్యల్లో భాగంగానే ఈ దాడులు జరిగాయి.