PMModi Welcomed By Macron Ahead Of AI Summit In Paris | పారిస్: భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విదేశీ పర్యటనకు బయలుదేరారు. సోమవారం రాత్రి పారిస్ చేరుకున్న ప్రధాని మోదీకి పారిస్‌లో ఘన స్వాగతం లభించింది. పారిస్‌లో జరిగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ఫ్రాన్స్‌కు చేరుకున్న మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఘన స్వాగతం పలికారు. మొదట ఎయిర్ పోర్టుకు వచ్చిన ఫ్రాన్స్ ఉన్నతాధికారులు అధికార లాంఛనాలతో మోదీని రిసీవ్ చేసుకున్నారు. అటు నుంచి మాక్రాన్ ఆఫీసుకు వెళ్లిన ప్రధాని మోదీని కౌగిలించుకుని ఫ్రాన్స్ అధినేత స్వాగతించారు.


తనకు పలికిన ఆహ్వానంతో పాటు మాక్రాన్ కలిసిన సంతోష సందర్భంపై మోదీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. నా ఫ్రెండ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ను పారిస్‌లో కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది” అని మాక్రాన్ ను కలిసిన ఫొటోలను మోదీ ఎక్స్ ఖాతాలో సోమవారం పోస్ట్ చేశారు. ఆర్మీ లాంఛనాలతో ప్రధాని మోదీని ఫ్రాన్స్ ప్రభుత్వం రిసీవ్ చేసుకున్న వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్కడ విపరీతంగా చలి ఉన్న కారణంగా మోదీ పెద్ద స్వెటర్, తలకు టోపీ ధరించారు. సైన్యం ఆయనకు గౌరవ వందనం చేసి ఆహ్వానం పలికిన వీడియో వైరల్ అవుతోంది. 






రోడ్డు మార్గాన వెళ్లిన ప్రధాని మోదీ పారిస్ లో ప్రవాస భారతీయులను కలిశారు. వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ చిరునవ్వుతో పలకరించారు. బోలో భారత్ మాతాకీ జై, నరేంద్ర మోదీకి జై అంటూ అంటూ ప్రవాస భారతీయులు నినాదాలు చేశారు. త్రివర్ణ పతాకాలు చేత పట్టుకుని ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు. మోదీని కలుసుకున్నందుకు తమకు చాలా సంతోషంగా ఉందని ప్రవాస భారతీయులు చెబుతున్నారు. 


అమెరికా ఉపాధ్యక్షుడి పలకరింపు


AI సమ్మిట్‌లో పాల్గొనడానికి పారిస్‌కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్‌ ప్రధాని మోదీని కలిశారు. పారిస్ లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో వీరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ప్రధాని మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా మొదట ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. ఇక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమెరికాకు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కీలక భేటీలలో మోదీ పాల్గొని పలు అంశాలపై చర్చలు జరుపుతారు. 


పారిస్‌లో ఐఏ సమ్మిట్, పలు కార్యక్రమాలు


మూడు రోజుల ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ  పారిస్‌లో జరగనున్న AI యాక్షన్ సమ్మిట్‌కు మాక్రాన్ తో కలిసి సహ అధ్యక్షత వహిస్తారు. అనంతరం ఫ్రాన్స్ అధినేతతో భారత ప్రధాని ద్వైపాక్షిక చర్చలలో పాల్గొంటారు. మోదీ, మాక్రాన్ లు తమ ప్రతినిధులతో కలిసి చర్చలు జరుపుతారు. భారత్-ఫ్రాన్స్ CEO ల ఫోరమ్‌ను ఉద్దేశించి ఇరుదేశాల అధినేతలు ప్రసంగిస్తారు. విజన్ 2047 గురించి పారిస్ వేదికగా మోదీ గళం విప్పనున్నారు. పర్యటనలో భాగంగా మార్సెయిల్‌లోని కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ నిర్వహిస్తున్న మజార్గ్స్ వార్ మెమోరియల్ ను సందర్శిస్తారు. మార్సెయిల్‌లో కొత్త కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాను మోదీ ప్రారంభిస్తారు. కాగా, ప్రధాని మోదీకి ఫ్రాన్స్‌లో ఇది ఆరో పర్యటన అని అధికారులు తెలిపారు.


Also Read: UK : యూకేలో అక్రమంగా పని చేస్తున్న వారందరికీ బ్యాడ్ న్యూస్ - అమెరికా తరహాలో గెంటేయాలని ప్రధాని స్టార్మర్ నిర్ణయం