Earthquake In Nepal:
నేపాల్ లో నవంబర్ నెల తొలి వారంలో భారీ భూకంపం సంభవించింది. అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు వణికిపోయారు. 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 128 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు.
నేపాల్ భూకంపం అంతం కాదు ఆరంభమే! నిపుణుల వార్నింగ్!
నేపాల్లో 2015న వచ్చిన భూకంపం నాటి విషాదఛాయలు ఇప్పటికీ అక్కడి ప్రజలను కలవరపెడుతూనే ఉంటాయి. అయితే.. దానికి మించిన ప్రకృతి విలయం రాబోతోందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నేపాల్లో నెల రోజుల్లో మూడు సార్లు భూమి కంపించింది. నిన్న రాత్రి వచ్చిన బలమైన ప్రకంపనలు పెను విషాదాన్ని మిగిల్చాయి. వందలాది మందిని మింగేశాయి. నేపాల్ భూకంపం ప్రభావం ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశం మొత్తం కనిపించింది. అయితే... ఇది అంతం కాదని అంటున్నారు నిపుణులు. నేపాల్లో మరిన్ని భారీ భూప్రకంపనలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.
హిమాలయాలు, నేపాల్ మధ్య ప్రాంతంలోని ప్రజలు మరిన్ని భూకంపాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్ హెచ్చరించారు. నవంబర్ 3న అర్థరాత్రి వచ్చిన భూ ప్రకంపనల మూలం నేపాల్లోని దోటీ జిల్లాకు సమీపంలో ఉందని ఆయన తెలిపారు. నిన్న ఒకే ప్రాంతంలో వరుసగా పలుమార్లు ప్రకంపనలు వచ్చాయని చెప్పారు. భూకంపం వచ్చిన ఈ ప్రాంతం నేపాల్ మధ్య భాగంలో ఉందని... అది ఆందోళన కలిగించే విషయమని అంటున్నారు భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్.