Israel Hamas War One Year: 7 అక్టోబర్ 2023 రోజున ఇజ్రాయెల్‌పై పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ భారీ స్థాయిలో దాడి చేసింది. ఓవైపు భూమార్గంలో ఇజ్రాయెల్ లోకి ప్రవేశిస్తూనే మరోవపు రాకెట్‌తో విరుచుకుపడింది. ఈ దాడిలో ఒక్క రోజులో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు మృత్యువాత పడ్డారు. హమాస్ సైన్యం 251 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయింది. పాలస్తీనా తీవ్రవాద మూక హమాస్ 7అక్టోబర్ 2023 ఉదయం 6:30 గంటలకు దక్షిణ ఇజ్రాయెల్‌పై 5,000 రాకెట్లు ప్రయోగించింది. అదే టైంలో వందలాది మంది హమాస్ సైన్యం ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించింది. అడ్డంగా వచ్చినవారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ దూసుకెళ్లింది. ఓ పండుగ రోజున ఈ అల్లకల్లోలం చెలరేగింది. 


హమాస్ దాడికి ప్రతిస్పందిస్తూ అక్టోబర్ 8న ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ ఆపరేషన్ స్వోర్డ్స్ ఆఫ్ ఐరన్‌ను ప్రారంభించింది. గాజాను పూర్తి స్థాయిలో ముట్టడించింది. గాజా స్ట్రిప్ ఉత్తర భాగంలో నివసిస్తున్న సుమారు 1.5 మిలియన్ల మంది ప్రజలను ఖాళీ చేయించింది. 


ఈ పరిణామాలతో ఇప్పటికి కూడా గాజా ప్రజలకు సరైన ఆహారం, తాగేందుకు నీరు, కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అక్కడ 70 శాతం భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పిన వివరాలు చూస్తే ఈ దాడుల్లో ఇప్పటివరకు 42 వేల మందికిపైగా మరణించారు. వీరిలో 16,765 మంది చిన్నారులు ఉన్నారు. దాదాపు 98 వేల మంది గాయపడ్డారు. 10 వేల మందికిపైగా అదశ్యమయ్యారు. ఈ వార్‌లో ఇప్పటివరకు 1,139 మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు, 8,730 మంది గాయపడ్డారు. ఈ దాడిలో 125 మంది జర్నలిస్టులు కూడా మరణించారు.


ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో జరిగినష్టమెంత?
అల్ జజీరా నివేదిక ప్రకారం  ఇజ్రాయెల్ దాడి కారణంగా గాజా స్ట్రిప్‌లోని 80 శాతం వాణిజ్య వ్యాపారాలు ధ్వంసమయ్యాయి. 87 శాతం పాఠశాల భవనాలు నేలమట్టమయ్యాయి. గాజా స్ట్రిప్‌లో 144,000 నుంచి 175,000 భవనాలు దెబ్బతిన్నాయి. 36 ఆసుపత్రుల్లో 17 మాత్రమే పని చేస్తున్నాయి. 68 శాతం రోడ్ నెట్‌వర్క్ నాశనమైంది. 68 శాతం వ్యవసాయ భూమి పనికి రాకుండా పోయింది. 


గాజా GDP 81 శాతం పడిపోయింది. 2.01 లక్షల మంది నిరుద్యోగులుగా మారారు. దాదాపు 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 85 వేల మంది పాలస్తీనా కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజా స్ట్రిప్‌లో 42 మిలియన్ టన్నులకుపైగా శిథిలాలు పేరుకుపోయాయి. దీనిని తొలగించడానికి కొన్ని ఏళ్లు పట్టవచ్చు. ఖర్చు కూడా 700 మిలియన్‌లకుపైగానే అవుతుందని అంచనా వేస్తున్నారు. 


ఇలా హమాస్‌తో యుద్ధాన్ని మొదలు పెట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఏడుగురు శత్రువులతో పోరాడుతోంది. గాజాలో హమాస్‌, లెబనాన్‌లో హిజ్బుల్లా, యెమెన్‌లో హౌతీలు, వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా టెర్రరిస్టులు, ఇరాక్‌, ఇరాన్‌, సిరియాకు షియా మిలిటెంట్లతో యుద్ధం చేస్తోంది. ఇప్పటికే హమాస్‌ సంస్థను నామరూపాలు లేకుండా చేసింది. హిజ్బుల్లా హెడ్స్‌ను కూడా లేపేసింది. మరోవైపు హౌతీలు, పాస్తీనా ఉగ్రవాదులు, షియా మిలీషియా గ్రూప్‌లపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేస్తోంది. ఇరాన్ దాడులను కూడా తిప్పికొట్టింది. దీంతో మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన అయితే ఉంది. ప్రపంచ దేశాలు  ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉంచాయి.