ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య విరామం లేకుండా యుద్ధం కొనసాగుతోంది. హమాస్ గ్రూప్ దాడులను ఇజ్రాయెల్ సైన్యం తిప్పుకొడుతోంది. ఇజ్రాయెల్‌ పట్టణాలు, నగరాల్లో 22 చోట్ల హమాస్‌ బృందాలకు, ఇజ్రాయెల్‌ సైన్యానికి మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌ పట్టణాల్లో హమాస్ మిలిటెంట్లు తుపాకులతో  రెచ్చిపోతున్నారు. హమాస్‌ ముష్కరులు పలువురిని బందీలుగా చేసుకుని తిరిగి గాజాకు వెళ్లారని తెలుస్తోంది. వీరిలో మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు అధికంగా ఉన్నారు.హమాస్ బందీలుగా చేసుకున్న ఇజ్రాయెలీలను పలువురిని ఇజ్రాయెల్ సైన్యం సురక్షితంగా రక్షించింది. ఇజ్రాయెల్‌ దక్షిణ జిల్లాలోని ఓఫాకిమ్‌ నగరంలోని ఓ ఇంటి నుంచి సైన్యం కాపాడింది. నలుగురు హమాస్ తీవ్రవాదులను ఇజ్రాయెల్‌ సైన్యం హతమార్చింది.  భద్రతా దళంలో ఒకరు గాయపడ్డారు. 


మిలిటెంట్లను ఏరివేస్తాం
దేశంలో చొరబడిన హమాస్ మిలిటెంట్లను ఏరివేస్తామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఆ తర్వాత హమాస్ స్థావరాలపై ఎదురు దాడి చేస్తామని హెచ్చరించింది. చొరబాటుదారుల ఏరివేత ఆపరేషన్‌ను ఐడీఎఫ్‌ తీవ్రతరం చేసింది. సరిహద్దుల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో సైన్యాన్ని మోహరించింది. భారీ సంఖ్యలో చొరబాటుదారులను అదుపులోకి తీసుకుంది. మరికొందర్ని హతమార్చింది.  మిలిటెంట్లు 14 ప్రాంతాల్లోకి ప్రవేశించారని, 22 చోట్ల పోరాటం కొనసాగుతోందని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. హమాస్‌ మిలిటెంట్లు కంచెను దాటుకుని వచ్చారని, మరికొంత మంది పారా గ్లైడర్లతో దిగారని వెల్లడించింది.


ఉప్పు నిప్పులా ఉండే ఇజ్రాయెల్‌, పాలస్తీనా
ఉప్పు నిప్పులా ఉండే ఇజ్రాయెల్‌, పాలస్తీనాల మధ్య యుద్ధ జ్వాలలు మరోసారి ఎగిసిపడ్డాయి. యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామునే వేల రాకెట్లను పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ హమాస్‌  గాజా నుంచి ప్రయోగించింది. సాయుధులైన డజన్లకొద్దీ మిలిటెంట్లు సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు. ఇజ్రాయెల్‌ పట్టణాల్లో మిలిటెంట్లు తుపాకులతో స్వైర విహారం చేశారు. డజన్లకొద్దీ ఇజ్రాయెలీలను బందీలుగా చేసుకున్నారు. ఇజ్రాయెల్‌ పట్టణాలు, నగరాల్లో 22 చోట్ల మిలిటెంట్లకు, ఇజ్రాయెల్‌ సైన్యానికి భీకర పోరు సాగుతోంది. రెండు పట్టణాల్లో పలువురిని బందీలుగా చేసుకుని పాగా వేశారు. వందల మంది మరణించారు. 11వందల మందికి గాయపడ్డారు. గాయపడిన వారిలో 9 మంది నేపాలీలు ఉన్నారు. 


ఇజ్రాయెల్ ఎదురుదాడి
హమాస్‌ మిలిటెంట్ల మెరుపు దాడితో ఇజ్రాయెల్‌ ఎదురుదాడికి దిగింది. పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 18వందల మందికిపైగా గాయపడ్డారు.  గాజాలోని అత్యంత ఎత్తైన భవనాలను ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో కూల్చి వేస్తోంది. హమాస్‌ కార్యాలయాలతోపాటు 14 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది. అక్కడ ఉండేవారంతా ఖాళీ చేసి వెళ్లాలని ముందుగా హెచ్చరించడంతో ప్రాణాపాయం తప్పింది.


దాడులను ఖండించిన బైడెన్, రిషి సునాక్
ఇజ్రాయెల్‌పై దాడిని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, యూకే ప్రధాని రిషి సునాక్‌ ఖండించారు. ఆ దేశానికి పూర్తి మద్దతు ప్రకటించారు. మరోవైపు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌తో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఫోన్‌లో చర్చలు జరిపారు. వెస్ట్‌బ్యాంక్‌లో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పాలని కోరారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌పై జరిగిన ఉగ్రదాడులను ఖండిస్తున్నట్లు బ్లింకన్‌ వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై తాము చేసిన మెరుపు దాడికి ఇరాన్‌ మద్దతు ఉందని మిలిటెంట్‌ సంస్థ హమాస్‌ ప్రకటించింది.