Israel Gaza War:


రాబందులకు, గద్దలకు GPS ట్రాకర్స్


Gaza News: అక్టోబర్ 7 న ఇజ్రాయేల్‌పై హమాస్ దాడులు చేసింది. అప్పటి నుంచి యుద్ధం (Israel Hamas War) కొనసాగుతూనే ఉంది. వేలాది మంది పౌరులు బలి అయ్యారు. అయితే...ప్రాణాలు కోల్పోయిన వారిలో చాలా మంది ఇంకా శిథిలాల కిందే చిక్కుకున్నారు. ఎక్కడ ఎన్ని మృతదేహాలున్నాయి..? ఎంత మంది బతికి ఉన్నారు..? అన్న లెక్కలు తేల్చడం కష్టంగా ఉంది. మృతదేహాల్ని గుర్తించడం సవాలుగా మారింది. ఈ క్రమంలోనే ఇజ్రాయేల్ ఆర్మీ (Israel Army) ఓ ఆలోచన చేసింది. డెడ్‌బాడీస్‌ని గుర్తించేందుకు గద్దలు, డేగలు, రాబందుల సాయం (Israel Army Using Eagles) తీసుకుంటోంది. వాటికి GPS ట్రాకింగ్‌ డివైజ్‌లు అమర్చి ఆ ప్రాంతానికి పంపుతోంది. డెడ్‌బాడీస్ ఉన్న చోట అవి వాలుతున్నాయి. అలా మృతదేహాల్ని గుర్తిస్తోంది ఇజ్రాయేల్ సైన్యం. చాలా మంది పౌరులు తమ వాళ్ల ఆచూకీ కోసం నెల రోజులుగా వెతుకుతున్నారు. కనీసం శవాల్నైనా అప్పగించాలని వేడుకుంటున్నారు. ఏం చేయాలో తెలియక...ఇలా పక్షుల్ని పంపి ఆచూకీ కనుక్కొంటున్నారు ఇజ్రాయేల్ సైనికులు. ఎప్పటి నుంచో వెతుకుతున్న నలుగురి మృతదేహాలు వెంటనే దొరికాయని వెల్లడించింది సైన్యం. ఓ పక్షి మరో చోట కూడా డెడ్‌బాడీస్‌ని గుర్తించింది. 


ఎకాలజిస్ట్‌ల సాయం..


ఇజ్రాయేల్ ఆర్మీకి ఎకాలజిస్ట్‌లు కూడా సాయం చేస్తున్నారు. బాగా ఆకలితో ఉన్న పక్షులనే ఈ పనికి పంపుతున్నారు. అందుకే చాలా త్వరగా మృతదేహాల్ని గుర్తించేందుకు వీలవుతోంది. పక్షులు ఎక్కడెక్కడైతే ఆగుతున్నాయో అక్కడ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. వెంటనే ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టి మృతదేహాల్ని వెలికి తీస్తున్నారు. ఇందుకోసం వందలాది పక్షులకు GPS Trackers అమర్చారు. ఈ యుద్ధంలో 1,400 మంది ఇజ్రాయేల్ పౌరులు చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. అటు గాజా హెల్త్ మినిస్ట్రీ మాత్రం మొత్తంగా 10 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని చెబుతోంది. ఈ లెక్కల విషయంలోనూ కన్‌ఫ్యూజన్ కొనసాగుతోంది. ఈ పక్షుల సాయంతో 843 మంది పౌరులతో పాటు 351 మంది సైనికులను గుర్తించారు. వాళ్లకు అవసరమైన వైద్య సాయం అందించారు.