ఇప్పటి వరకు ఇది అనుమానంగా ఉండేది. ఇప్పుడు ఇజ్రాయెల్ అర్మియే ప్రకటించింది. శుక్రవారం నాడు బీరూట్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేసింది. మెరుపు దాడులతో ఆ ప్రాంతమంతా భీతిల్లింది. హిజ్బుల్లా చీఫ్‌ హసన్ నస్రల్లా అక్కడ ఉన్నారన్న ఏకైక కారణంతో సడెన్‌గా వైమానికి దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది. 
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆరు భవనాలు నేల మట్టమయ్యాయని పేర్కొన్న హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ నస్రల్లా క్షేమంగా ఉన్నట్టు పేర్కొంది. అయితే ఇప్పుడు దీన్ని ఖండించిన ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం సంచలన ప్రకటన చేసింది. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా హతమయ్యాడని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. హసన్ నస్రల్లా ఏ మాత్రం ప్రమాదకారి కాడని ప్రపంచంలో ఎలాంటి దాడులు చేయలేడని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. హసన్ నస్రల్లా 32 సంవత్సరాల పాటు సంస్థకు చీఫ్‌గా ఉన్నారు.






నస్రల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదవ్ శోషని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. AFP నివేదికప్రకారం, లెబనాన్ రాజధాని బీరూట్‌పై శుక్రవారం (27 సెప్టెంబర్ 2024) జరిగిన వైమానిక దాడిలో హిజ్బుల్లా చీఫ్ మరణించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డేవిడ్ అవ్రహం తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం, హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై దాడి చేశామని, అక్కడ హసన్ నస్రల్లా కూడా ఉన్నాడని సైన్యం పేర్కొన్నట్టు రిపోర్టు చేసింది. 


చాలా కాలంగా బీరుట్‌తో సహా పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం నిరంతరం దాడులు చేస్తోంది. బీరుట్‌లోని దహియా నగరంలో నివసిస్తున్న ప్రజలను వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని IDF సూచించింది. ఇజ్రాయెల్‌పై దాడిని అడ్డుకునేందుకు అక్కడ ఉండే ప్రజలను రక్షణ కవచాలుగా హిజ్బుల్లా వాడుకుంటోందన్న కారణంతో ప్రజలను ఖాళీ చేయాలని సూచించారు. 


ఇజ్రాయెల్ న్యూస్ ఛానెల్ ప్రకారం... నస్రల్లాతోపాటు, అతని కుమార్తె జైనాబ్ కూడా మరణించారు. ఇజ్రాయెల్ దాడి చేసిన కమాండర్ సెంటర్‌లో నస్రల్లా కుమార్తె మృతదేహం గుర్తించారు. శుక్రవారం రాత్రి హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ క్షిపణిని ప్రయోగించింది. ఇందులో 6 మంది మరణించారు, 90 మంది గాయపడ్డారు.