Indian Student Died in Canada: ఉన్నత చదువుల కోసం దేశం కాని దేశం వెళ్లాడు. అక్కడే ఉండి చదువుకుంటూ పార్ట్ టైమ్ పిజ్జా డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. ఈక్రమంలోనే పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లిన అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన అతడు చికిత్స పొందతూ ఈరోజు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న కెనడా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


భారతదేశానికి చెందిన 24 ఏళ్ల గుర్ విందర్ నాథ్.. ఉన్నత చదువుల కోసం కెనాడ వెళ్లాడు. ఒంటారియో ప్రావిన్సులో ఉంటూ చదువుకుంటున్నాడు. సాయంకాల వేళల్లో పిజ్జా డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. జులై 9వ తేదీన అతడు మిస్సిసాగా ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. అయితే అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు గుర్ విందర్ పై దాడి చేశారు. అతడి వాహనాన్ని దొంగిలించారు. ఈ ఘటనలో గుర్ విందర్ తల, శరీర భాగాల్లో తీవ్ర గాయులు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందతూ గుర్ విందర్ జులై 14వ తేదీన మృతి చెందినట్లు టొరంటోలని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. గుర్ విందర్ మృతి ఎంతో బాధాకరం అని, అలాగే అతడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు భారత కాన్సులేట జనరల్ సిద్ధార్థ్ నాథ్ ప్రకటించారు. మృతుడు గుర్ విందర్ కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. 


వాహనం దొంగిలించేందుకు పిజ్జా ఆర్జర్ చేసిన నిందితులు


మరోవైపు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ఫిల్ కింగ్ మాట్లాడుతూ... గుర్ విందర్ వాహనాన్ని దొంగతనం చేసేందుకే నిందితులు పిజ్జా ఆర్డర్ చేశారని తెలిపారు. పక్కా ప్రణాళికతోనే వాహనం తీసుకెళ్లారని ఆక్రమంలోనే అడ్డుకోబోయిన గుర్ విందర్ పై దాడి చేశారని వివరించారు. వాహనం తీసుకున్న వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోగా.. ఐదు కిలో మీటర్ల దూరం వెళ్లాక నిందితులు వాహనాన్ని వదిలేసి పారిపోయినట్లు గుర్తించామని అన్నారు. ప్రస్తుతం వాహనాన్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఫిల్ కింగ్ తెలిపారు. 


నివాళిగా 200 మంది విద్యార్థుల కొవ్వుత్తుల నిరసన


జులై 27 తేదీన గుర్ విందర్ మృతదేహాన్ని భారత దేశానికి తరలించబోతున్నారు. గుర్ విందర్ ప్రస్తుతం చివరి సెమిస్టర్ పరీక్షల కోసం కెనడాలో ఉన్నాడని అతని స్నేహితులు చెబుతున్నారు. ఇది పూర్తయిన వెంటనే సొంతంగా పిజ్జా ఔట్ లెట్ ఓపెన్ చేయాలని గుర్ విందర్ కలలు కన్నట్లు వివరించారు. కానీ ఆ కల పూర్తికాకుండానే ఇలా దాడికి గురై స్నేహితుడు చనిపోవడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్నేహితుడి మృతికి నివాళిగా దాదాపు 200 మంది బారతీయ విద్యార్థులు కొవ్వొత్తుల నిరసన నిర్వహించారు.