US new regulations: అమెరికాలో మొదలైన ఆంక్షలు.. రిటర్న్ టికెట్ లేని భారత జంటలకు షాక్
ట్రంప్ జారీ చేసిన ఆంక్షలను అక్కడి అధికారులు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో ఆశతో తమ పిల్లలను చూసుకునేందుకు భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన ఓ తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది.

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో పరిస్థితులు మారిపోయాయి. పలు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనూ జన్మతః వచ్చే పౌరసత్వాన్ని (బర్త్ రైట్ సిటిజన్ షిప్) రద్దు చేశారు. 127 ఏళ్లుగా వస్తున్న ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఆర్డర్ జారీ చేశారు. ఈ నిర్ణయంతో విదేశీయులతోపాటు హెచ్1బీ, ఎల్1 వీసాలపై అక్కడ ఉంటున్న లక్షలాది భారతీయ కుటుంబాలు గందరగోళంలో పడ్డాయి.
రిటర్న్ టికెట్ తప్పనిసరి
ట్రంప్ జారీ చేసిన ఆంక్షలను అక్కడి అధికారులు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో ఆశతో తమ పిల్లలను చూసుకునేందుకు భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన ఓ తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. వారికి రిటర్న్ టికెట్ లేకపోవడంతో అధికారులు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లోనే వారిని ఆపేశారు. తమ పిల్లల వద్ద ఐదు నెలలపాటు అక్కడ ఉండేందుకు ఆ జంట బి–1/బి–2 విజిటర్ వీసాలతో వెళ్లగా.. రిటర్న్ టికెట్ లేదని న్యూయార్క్లోకి అనుమతించలేదు. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు రిటర్న్ టికెట్ తప్పనిసరి అని ఇమ్మిగ్రేషన్ అధికారులు వారికి తెలియజేశారు.
భారతీయుల్లో గుబులు
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అక్షపదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా సుదీర్ఘ ప్రసంగం చేశారు. ముఖ్యంగా అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయం గ్రీన్కార్డ్ లేకుండా అమెరికాలో నివసిస్తున్న అనేకమంది భారతీయుల్లో గుబులు రేపుతోంది.
అక్రమ వలసల్లో మూడో స్థానం
ప్యూ రీసెర్చ్ సెంటర్ వివరాల ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్కు అక్రమ వలసలు వెళ్లే ప్రధాన దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2022 నాటికి, 7 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు డాక్యుమెంట్స్ లేకుండా అమెరికాలో నివసిస్తున్నట్లు అంచనా వేసింది. మెక్సికన్లు, హోండురాన్స్ తర్వాత భారత్ నుంచి అక్రమ వలసలు ఉన్నట్లు పేర్కొంది.
తమకు అవకాశం లేకపోయినా తమ పిల్లలకైనా పౌరసత్వం దక్కేలా..
అక్రమ వలసలను కట్టడి చేసేందుకు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని ట్రంప్ రద్దు చేశారు. ఫలితంగా అమెరికాలో ఉంటున్న విదేశీ మహిళలు అక్కడ ప్రసవిస్తే వారి శిశువులు పొందే పౌరసత్వ హక్కు రద్దవుతుంది. ఫిబ్రవరి 20 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే తమకు అవకాశం లేకపోయినా తమ పిల్లలకైనా అమెరికా పౌరసత్వం దక్కాలని భారతీయులు కోరుకుంటున్నారు. డెడ్లైన్కు ముందుగానే సిజేరిన్లు (సి–సెక్షన్) చేయించాలని భావిస్తున్నారు. సాధ్యాసాధ్యాల కోసం డాక్టర్లను సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలోనే సిజేరియన్ల కోసం ఆస్పత్రులకు వెళ్లే భారతీయ మహిళల సంఖ్య కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం 8వ నెలతో ఉన్న ఎంతోమంది భారతీయ గర్భిణులు తమకు సిజేరియన్ చేయాల్సిందిగా పలు ఆస్పత్రుల్లో అంగీకార పత్రాలిస్తున్నారని, 7 నెలల గర్భంతో ఉన్నవాళ్లు కూడా హాస్పిటల్స్ కు పరుగులు తీస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు.
లేదంటే దేశం విడిచి వెళ్లాల్సిందే..
ఫిబ్రవరి 20వ తేదీలోపు బిడ్డలకు జన్మనిస్తే వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. లేదంటే 21 ఏళ్లు వచ్చేసరికి వాళ్లు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ వ్యవధిలో తండ్రి లేదా తల్లికి పౌరసత్వం లేదా గ్రీన్ కార్డు వస్తే పిల్లలు అక్కడే ఉండవచ్చు. పౌరసత్వం లేదా గ్రీన్ కార్డు వస్తుందో రాదో అనే భయంతో పిల్లల్ని ముందుగానే కనేయాలని సిజేరిన్ల కోసం ఆస్పత్రులను సంప్రదిస్తున్నారు. తమకు పౌరసత్వం లేకపోయినా, అమెరికా గడ్డపై పుట్టే తమ బిడ్డలకు పౌరసత్వం ఉండాలని భావిస్తున్నారు తల్లిదండ్రులు.
ముందుగానే జన్మనిస్తే శిశివులకు అనారోగ్య సమస్యలు
అయితే ఇలా ముందుగానే పిల్లలకు జన్మనిస్తే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. శిశువుల్లో ఊపిరితిత్తుల సమస్యలు, ఫీడింగ్ సమస్యలు, తక్కువ బరువుతో పుడతారని సిజేరిన్ల కోసం కన్సల్ట్ అయ్యే తల్లిదండ్రులకు డాక్టర్లు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. న్యూజెర్సీలో ప్రసూతి క్లినిక్ నడుపుతున్న భారత మూలాలున్న డాక్టర్ ఎస్డీ రమ మాట్లాడుతూ.. ట్రంప్ ప్రకటన చేసినప్పటి నుంచి ముందస్తు ప్రసవాల కోసం భారతీయ తల్లిదండ్రుల నుంచి మాకు అభ్యర్థనలు వస్తున్నాయి. గర్భం దాల్చి 9, 8 నెలలతో ఉన్నవారు ఫిబ్రవరి 20లోపు సి-సెక్షన్లు చేయాలని అడుగుతున్నారని ఆమె తెలిపారు.
Also Read: Hamas : అమల్లోకి కాల్పుల విరమణ ఒప్పందం.. నలుగురు సైనికులను విడుదల చేసిన హమాస్