పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. గుజరాత్ సముద్ర తీరంలో తాజాగా భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. పాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ. 280 కోట్ల విలువైన హెరాయిన్ ను ఇండియన్ కోస్ట్ గార్డ్స్, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ స్వాధీనం చేసుకున్నాయి..






ఎలా పట్టుకున్నారు?


రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌తో కూడిన పాకిస్థానీ ఓడ 'అల్ హజ్‌'ను ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకుంది. గుజరాత్ రాష్ట్ర తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో తొమ్మిది మంది సిబ్బందితో కూడిన పాకిస్థాన్ ఓడను పట్టుకుని, అందులో ఉన్న రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది.


పాకిస్థాన్ ఓడ 'అల్ హజ్' భారత జలాల్లోకి ప్రవేశించినప్పుడు భారత తీర రక్షక దళ నౌకలు అడ్డగించి పట్టుకున్నాయని రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని, తదుపరి విచారణ కోసం పడవతో పాటు అందులో ఉన్న పాకిస్థాన్ సిబ్బందిని గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జాఖౌ నౌకాశ్రయానికి తీసుకు వచ్చినట్లు రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు.


ఎట్టిపరిస్థితుల్లోనూ భారత భూభాగంలోకి డ్రగ్స్‌ను రానివ్వబోమని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ తెలిపింది. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను భారత్ చేర్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొంది.


అట్టారీ సరిహద్దులో ఆదివారం కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ రూ.700 కోట్ల విలువైన 102 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. అఫ్గానిస్థాన్‌ నుంచి ఈ డ్రగ్స్‌ను తరలించగా అమృత్‌సర్‌ కస్టమ్స్‌ (పీ) కమిషనరేట్‌ పరిధిలోని ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ (ఐసీపీ)లో 102కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.


Also Read: Hanuman Chalisa Row: ప్రధాని మోదీని తాకిన హనుమాన్ చాలీసా ఎఫెక్ట్


Also Read: World Oldest Person Died: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత- వయసెంతంటే?