Israel Hamas War News Updates: బందీలు, ఖైదీల మార్పిడి కోసం సంధిని మరింత పొడిగించేందుకు హమాస్ (Hamas) సిద్ధంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. గాజా (Gaza) పౌరుల కోసం ఇజ్రాయెల్ (Israel) సేఫ్ జోన్‌లను ఏర్పాటు చేయాలని కోరింది. అంతర్జాతీయంగా పెరిగిన ఒత్తిడి కారణంగా హమాస్, ఇజ్రాయెల్ తాత్కాలికంగా  కాల్పులు, దాడులను విరమించాయి. పాలస్తీనా బందీ (Palestine Hostages)ల విడుదలతో పాటు ప్రమాదకరంగా ఉన్న దాడులను మరికొంత కాలం ఆపేయాలని హమాస్ కోరుతోంది. అయితే దీనిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. 
 
ఏడు రోజుల విరామం తర్వాత శుక్రవారంతో ప్రస్తుత సంధి గడువు ముగియనుంది. దీంతో US విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్‌లోని నాయకులతో సమావేశమై కాల్పుల విరమణను పొడిగించాలని సూచించారు. మరికొద్ది కాలం కాల్పులు లేకుండా ముందుకు సాగేలా చూడాలని కోరుకుంటున్నట్లు టెల్ అవీవ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు. అమాయక పాలస్తీనియన్ల ప్రాణ నష్టాన్ని తగ్గించే చర్యలను ఇజ్రాయెట్ అమలు చేయాలని, దక్షిణ, మధ్య గాజాలోని ప్రాంతాలను స్పష్టంగా చెప్పడం ద్వారా దాడులను నుంచి అమాయకులను కాపాడవచ్చని అన్నారు. 


మీడియాతో మాట్లాడేందుకు తమకు అధికారం లేదని, కానీ సంధిని పొడిగించడానికి సిద్ధంగా ఉందని హమాస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మధ్యవర్తులు ప్రస్తుతం సంధి కొనసాగించేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ దాడులతో రక్తసిక్తమైన గాజాలోకి వైద్య సామాగ్రి, ఆహారం, ఇంధనాన్ని అందించడానికి అంతర్జాతీయ సంస్థలు మరింత సమయం కోరాయి. అమాయక పౌరులకు అవసరమైన మానవతా సహాయం అందించడానికి వీలుగా ప్రకటించిన సంధి ఫలితాలను ఇస్తోందని బ్లింకెన్ అన్నారు. 


నేటితో సంధి సమయం ముగుస్తుండంతో గాజా పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో సారి బాంబులు, రాకెట్లు, తుపాకుల దాడుల్లో మరణించాల్సి వస్తుందనే ఆందోళన వారు వ్యక్తం చేస్తు్న్నారు. సంధిని కొనసాగించాలని, శాంతి నెలకొల్పాలని, అందరు సంతోషంగా ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒక వైపు హమాస్ సంధి కోరుతూనే కవ్వింపు చర్యలుకు పాల్పడుతోంది. తాజా సంధి పొడిగింపు తర్వాత కొన్ని గంటల వ్యవధిలో జెరూసలేంలో ముగ్గురిని కాల్చి చంపింది. 


బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఇటీవలే కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇరు వర్గాలు నాలుగు రోజుల పాటు యుద్ధాన్ని నిలిపివేశాయి. బందీలను విడుదల చేసేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. ఇందులో భాగంగానే విడతల వారీగా బందీలను అప్పగించారు. ఇటు ఇజ్రాయెల్ కూడా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా వాసులకు విముక్తి కలిగించింది. ఈ ఒప్పందం శుక్రవారంతో ముగియనుంది.


వెనక్కి తగ్గేది లేదు
హమాస్ అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై దాడులు మొదలు పెట్టింది. ప్రతిగా ఇజ్రాయెల్ ఎదురు దాడులు చేసింది. ఫలితంగా ఇరు వైపులా వేల మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా నగరం రక్తసిక్తమైంది. అక్కడి ప్రజలకు సాయం చేసేందుకు యూఎన్, ప్రపంపచ దేశాలు గడువు కోడరంతో నాలుగు రోజుల పాటు యుద్ధం ఆగింది. అప్పటి నుంచి సంధి కొనసాగుతోంది. అయితే యుద్ధం విషయంలో హమాస్, ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.


శాంతి మంత్రం పఠిస్తూనే యుద్ధ సన్నాహాలు సైతం చేస్తున్నారు. ఒక్కసారి ఈ డీల్‌ ముగిసిపోగానే మళ్లీ యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ కూడా చెబుతోంది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి మళ్లీ గాజాపై దాడులు మొదలు పెట్టాలని సైన్యానికి ప్రభుత్వం ఆదేశించింది.