అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. దేశం నుంచి అమెరికా బలగాలు వెనక్కి వెళ్లినప్పటి నుంచి పూర్తి స్థాయి నియంత్రణ కోసం ఎదురుచూస్తున్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటనలు తాలిబన్ నేతలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో సెర్చింజన్ దిగ్గజం రంగంలోకి దిగింది. అఫ్గాన్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారికి మెయిల్స్, అధికారిక ఖాతాలు దుర్వినియోగం అవుతాయని భావించిన టెక్ దిగ్గజం తన పనిని మొదలుపెట్టింది. 


అఫ్గాన్ ప్రభుత్వం, ప్రభుత్వ శాఖలు, అధికారులకు చెందిన ఖాతాలను లాక్ చేసింది. తాలిబన్ల చేతికి అఫ్గాన్ ప్రభుత్వం, నిధులు, పాలనా వ్యవహారాలు అందకుండా చేయడంలో భాగంగా గూగుల్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అల్ఫాబెట్‌కు చెందిన గూగుల్ సంస్థ అఫ్గానిస్థాన్ ప్రభుత్వానికి చెందిన ఖాతాలను, వెబ్‌సైట్స్‌ను లాక్ చేసింది. ఈ విషయాన్ని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. తాలిబన్ల నుంచి హాని కలగకుండా అఫ్గాన్‌కు తాము చేసే మేలు కేవలం ప్రభుత్వ ఖాతాలు, అధికారుల ఖాతాలను లాక్ చేసి వారికి వివరాలు అందకుండా చేయడమేనని గూగుల్ భావించింది. పలు అంతర్జాతీయ మీడియాలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేశాయి. అయితే అఫ్గాన్ ప్రభుత్వ ఖాతాలు, ఉద్యోగుల వివరాలు రాబట్టేందుకు తాలిబన్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.


Also Read: Afghanistan Taliban Rule: అఫ్గాన్ లో తాలిబన్ల సర్కార్.. అధినేతగా ముల్లా బరాదర్!


ప్రభుత్వ అధికారుల వివరాలను రాబట్టేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారని ఓ అధికారి రాయ్‌టర్స్ ప్రతినిధికి తెలిపారు. ఉద్యోగుల జీతభత్యాలు, బయో మెట్రిక్ లాంటి వివరాలు రాబట్టి.. పాత ఉద్యోగులను పనికి రప్పించే దిశగా తాలిబన్ నేతలు చర్యలు తీసుకుంటున్నారు. అఫ్గాన్ ప్రభుత్వ ఖాతాలు, ఉద్యోగుల వివరాలను సేకరించి తమకు ఇవ్వాలని తాలిబన్లు తనను అడిగారని ఓ మాజీ ఉద్యోగి వెల్లడించారు. ఇలా చేస్తే గత ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులతో పాటు ఉద్యోగులకు హాని తలెత్తుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


తాలిబన్ల చేతికి ప్రభుత్వానికి సంబంధించిన కీలక వివరాలు చిక్కితే మాత్రం పరిస్థితి మరింత దిగజారుతుందని అఫ్గాన్ నేతలతో పాటు అంతర్జాతీయ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాలిబన్ల వద్ద పనిచేస్తూ బానిసల్లా బతకడం తమ వల్ల కాదంటూ అధికారులు, ఉద్యోగులు సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ అఫ్గాన్ ప్రభుత్వ వెబ్‌సైట్స్, ప్రభుత్వ ఖాతాలు, అధికారుల వివరాలు తెలిపే ఖాతాలను తాత్కాలికంగా లాక్ చేసింది. 


Also Read: Taliban Crisis News: ఓవైపు తాలిబన్ల తూపాకీ తూటాలు.. మరోవైపు ప్రజల ఆకలి కేకలు 


భారతీయ ముస్లింలను వదిలేయండి.. కేంద్ర మంత్రి నఖ్వీ
భారత ప్రభుత్వం కాశ్మీర్‌లో ముస్లింల గురించి ఆలోచించాలని, వారికి గొంతుకగా మారాలని తాలిబన్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. మతం ఆధారంగా దాడులు చేయలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నఖ్వీ స్పందించారు. ‘భారతదేశంలో మసీదులలో ప్రార్థనలు జరుపుతున్న ముస్లింలపై దాడులు జరగడం లేదు. బాలికలు స్కూళ్లకు వెళుతున్నారు. మేం రాజ్యాంగాన్ని అనుసరిస్తాం. మా దేశానికి చెందిన ముస్లింలకు హాని తలపెట్టవద్దు. దయచేసి వారిని మాత్రం వదిలేయాలంటూ చేతులెత్తి మొక్కుతున్నానని’ నఖ్వీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తాలిబన్లను కోరారు.