వైద్య చరిత్రలోనే మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. క్యాన్సర్ రోగులకు సంజీవని లాంటి డ్రగ్‌ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని మంచి ఫలితాలను సాధించింది. మల క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిపై దీన్ని ప్రయోగిస్తే అద్భుతమైన ఫలితాలు  వచ్చాయని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. 18 మంది రోగులకు దాదాపు ఆరు నెలల పాటు దోస్టార్‌లిమాబ్ అనే ఔషధాన్ని ఇచ్చారు. ఆరు నెలల తర్వాత పరీక్షలు చేస్తే వారిలో క్యాన్సర్ కణాలు పూర్తిగా మాయమైనట్టు గుర్తించారు.  


దోస్టార్లిమాబ్ అనే ఔషధం మానవ శరీరంలో ప్రత్యామ్నాయ ప్రతిరోధకాలును ఉత్పత్తి చేస్తుంది. మొత్తం 18 మల క్యాన్సర్ రోగులకు ఇదే మందు ఇచ్చారు. చికిత్స ఫలితంగా ప్రతి రోగిలో క్యాన్సర్ పూర్తిగా నిర్మూలనైంది. ఆ 18 మందికి ఎండోస్కోపీ, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ లేదా PET స్కాన్‌లు, MRI స్కాన్‌ ఏ పరీక్షలు చేసినా క్యాన్సర్ కణాలు కనిపించలేదు. 


న్యూయార్క్‌లోని మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్‌కు చెందిన డాక్టర్ లూయిస్ ఎ. డియాజ్ జె మాట్లాడుతూ... "క్యాన్సర్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి" అని అన్నారు.


న్యూయార్క్ టైమ్స్ ప్రకారం క్లినికల్ ట్రయల్‌లో పాల్గొన్న రోగులు క్యాన్సర్‌ తగ్గ ముందు కూడా చాలా చికిత్సలు తీసుకున్నారు.  కీమోథెరపీ, రేడియేషన్, ఇన్వాసివ్ సర్జరీలు కూడా జరిగాయి. అయినా వాళ్లకు ప్రయోజనం కనిపించలేదు. చివరి ప్రయత్నంగా 18 మంది రోగులపై దోస్టార్లిమాబ్‌ను ప్రయోగించి చికిత్స అందించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వారు చేసిన ప్రయత్నం ఆశ్చర్యపరిచే విధంగా ఫలితాలు ఇచ్చింది. 


ఈ ఫలితాలు ఇప్పుడు వైద్య ప్రపంచంలో సంచలనం రేపుతున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కొలొరెక్టల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ అలాన్ పి. వేనూక్ మాట్లాడుతూ... ప్రతి ఒక్క క్యాన్సర్‌ రోగికి పూర్తి ఉపశమనం అనేది ఇప్పటి వరకు వినలేదని అన్నారు. ఇప్పుడు జరిగిన పరిశోధన ఫలితాలు మాత్రం వైద్య చరిత్రలోనే మొదటిదని అభిప్రాయపడ్డారు. ట్రయల్స్‌లోనే మంచి ఫలితాలు సాధించిన ఈ కచ్చితంగా ప్రత్యేకమైందని, అందర్నీ ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. 


క్యాన్సర్‌ను జయించామన్న రోగుల ఆనందాన్ని వివరించారు మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆండ్రియా సెర్సెక్. "రోగులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు" అని అన్నారు.


క్యాన్సర్‌ రోగులకు ప్రతి మూడు వారాలకోసారి ఆరు నెలల పాటు దోస్టార్‌లిమాబ్‌ను ఇచ్చారు. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న 18 మంది కూడా ఒకే స్టేజ్‌లో ఉన్న క్యాన్సర్‌ రోగులు.ఈ క్యాన్సర్‌ రెక్టమ్‌లోనే కేంద్రీకృతమైందని... ఇతర అవయవాలకు వ్యాపించలేదని వైద్యులు తెలిపారు. 


ఔషధాన్ని సమీక్షించిన క్యాన్సర్ పరిశోధకులు... చికిత్స ఆశాజనకంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే ఇది ఎక్కువ మంది రోగులకు పని చేస్తుందో లేదో చూడాలన్నారు. మిగతా క్యాన్సర్‌లకు ఉపశమనం కలిగిస్తుందో లేదో తెలియాలంటే పెద్ద ఎత్తున ట్రయల్స్ అవసరం ఉందని అంటున్నారు.