Dalai Lama: దలైలామా వారసుడి అంశం చాలా కాలంగా చర్చల్లో ఉంది. ఇప్పుడు ఉన్న ఆయన 90 వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. అందుకే మరోసారి వారసుడి అంశంపై తెరపైకి వచ్చింది. ఇది టిబెట్‌కు సంబంధించిన విషయమే అయినా వారసుడు ఎవరని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. దలైలామా కేవలం ఓ బౌద్ద మత బోధకుడిగానే కాకుండా ప్రపంచశాంతిని కాంక్షించే వ్యక్తిగా చాలా దేశాలు చాలా గౌరవిస్తాయి. అందుకే ఇది కేవలం టిబెట్‌కు సంబంధించిన విషయంగానే కాకుండా యావత్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేసే నిర్ణయంగా చూస్తున్నారు. 
దలైలామా వారసుడి ఎంపికను ప్రభావితం చేయాలని చైనా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. భారత్ లాంటి దేశాలు మాత్రం టిబెట్‌ స్వతంత్రను గౌరవిస్తున్నాయి. దలైలామా వారసుడిపై జరుగుతున్న చర్చ కేవలం ఓ వ్యక్తికి బాధ్యతలు అప్పగించే బాధ్యతే కాకుండా రాబోయే తరాలకు మత స్వేచ్ఛను, అంతర్జాతీయ సంబంధాలను తెలియజేస్తుంది. 

Continues below advertisement


వారసుడి ప్రకటనపై దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు 


జూన్ 30న జరిగిన ఓ ఆధ్యాత్మిక చర్చలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత దలైలామా. వారుసుడి నిర్ణయం కోసం ప్రత్యేక ఫ్రేమ్‌ వర్క్ ప్రకారం జరుగుతుందని వెల్లడించారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే ఇదే అంశంపై 2011లో కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో బౌద్ధ నాయకులు, ఇతర బౌద్ధ ఆధ్యాత్మిక సంఘాలతో సమావేశమైన ఆయన దలైలామా సంస్థ కొనసాగింపు పునరాలోచించాలని అన్నారు. ఇప్పుడు మాత్రం వారసత్వం గురించి చర్చించారు. ప్రస్తుత దలైలామా తన 90 పుట్టినరోజును జులై ఆరున జరుపుకోనున్నారు. దీని కంటే ముందు వారసత్వంపై చేసిన కామెంట్స్‌ ఆసక్తిగా మారాయి.  


ధర్మశాలలోని మైక్లియోడ్‌గంజ్‌లో ఒక బౌద్ధ మత సమ్మేళంలో వారసత్వంపై అనుమానాలు నివృత్తి చేశారు. దలైలామా పదవి 600 ఏళ్లుగా కొనసాగుతుందని ఇకపై కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆ పదవిని అలంకరించే వ్యక్తిని ఎంపిక చేసే బాధ్యతను గాడెన్ ఫాడ్రాంగ్ ట్రస్ట్‌కు ప్రస్తుతం దలైలామా అప్పగించారు. 


గాడెన్ ఫాడ్రాంగ్ ట్రస్ట్‌ను 2015లో ప్రారంభించారు. భవిష్యత్‌ దలైలామాను ఎంచుకునే పూర్తి అధికారం కలిగి ఉందని ప్రకటించారు. 2011లో చేసిన ప్రకటన తర్వాతా చాలా దేశాల నుంచి అభ్యర్థనలు వచ్చినట్టు తెలిపారు దలైలామా. వారసత్వాన్ని కొనసాగించాలని రిక్వస్ట్ చేసినట్టు వెల్లడించారు. అందుకే ఆధ్యాత్మిక సంప్రదాయ ప్రకారం ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని స్పష్టం చేశారు. తన పుట్టినరోజు కంటే ముందే ఈ ప్రకటన రావడం ఆసక్తిని రేపింది. 


దలైలామా ఎంపికను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. టిబెట్‌పై ఆధిపత్యం చెలాయిస్తూ ఈ దలైలామా ఎంపికను కూడాప్రభావి చేయాలని భావించింది. గోల్డెన్ అర్న్ పద్ధతిలో తన మనిషిని నియమించుకోవాలని ఎత్తులు వేసింది. కానీ దలైలామా చేసిన ప్రకటన చైనాకు షాక్‌కి గురి చేసింది. 


వారసుడి ఎంపికపై దలైలామా చేసిన ప్రకటనపై కూడా చైనా ఘాటుగా స్పందించింది. చైనా మత స్వేచ్ఛకు కట్టుబడి ఉందని చెబుతూనే పూర్వీకులు చెప్పినట్టు గోల్డెన్ అర్న్‌ పద్ధతిలోనే జరగాలని పట్టుబడుతోంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి అంటోంది. మత స్వేచ్ఛ ఉన్నప్పటికీ బౌద్ధ గురువుల ఎంపిక కోసం ప్రత్యేక రూల్స్ ఉన్నట్టు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్ ప్రకటించారు. 


 గోల్డెన్ అర్న్ పద్ధతి అంటే ఏంటీ?
గోల్డెన్ అర్న్ (Golden Urn) పద్ధతిని 1793లో చైనా క్వింగ్ రాజవంశం తీసుకొచ్చింది. టిబెట్‌లో బౌద్ధ మత లామాలను ఎంపిక చేయడానికి దీన్ని స్టార్ట్ చేశారు. ఈ విధానంలో పోటీలో ఉండే వారి పేర్లను బంగారు పాత్ర (Golden Urn)లో వేసి ఒక పేరును లాటరీ ద్వారా తీస్తారు. అందులో ఎవరు పేరు ఉంటే వారినే లామాగా ప్రకటిస్తారు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకొని టిబెట్‌లో చైనా అనుకూల వర్గాన్ని తయారు చేయడానికి చైనా ప్రయత్నిస్తోంది. అందుకే ఈ విధానంలోనే ఎంపిక జరగాలని పట్టుబడుతోంది. 


ప్రస్తుత దలైలామా పూర్తి పేరు ఏంటీ?


ప్రస్తుతం 14 దలైలామాగా ఉన్న వ్యక్తి అసలు పేరు"టెన్జిన్ గ్యాట్సో" పుట్టనప్పుడు తల్లిదండ్రులు లామో ధోండప్ అని పేరు పెట్టారు. ఈయన 1935 జులై 6న టిబెట్‌లోని తక్సర్ గ్రామంలో పుట్టారు. 1939లో 14వ దలైలామాగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ధర్మశాలలో నివసిస్తున్నారు.