Li Shangfu Missing: 


లీ షంగ్‌ఫూ అదృశ్యం..


చైనా రక్షణ శాఖ మంత్రి లీ షంగ్‌ఫూ (Li Shangfu) కనిపించకుండా పోయి రెండు వారాలు దాటింది. ఇప్పటి వరకూ ఆయన ఎక్కడున్నారన్న జాడ తెలియలేదు. ప్రభుత్వమే అండర్‌గ్రౌండ్‌లోకి పంపిందా..? లేదంటే ఇంకేదైనా కారణాలున్నాయా అని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే...దీనిపై అమెరికా వాదన మాత్రం వేరేలా ఉంది. లీ షంగ్‌ఫూని చైనా ప్రభుత్వం రహస్యంగా విచారిస్తోందని చెబుతోంది అగ్రరాజ్యం. అంతే కాదు. ఆయనను రక్షణ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించినట్టూ వార్తలు వస్తున్నాయి.  Financial Times ఈ విషయం వెల్లడించింది. జిన్‌పింగ్ కేబినెట్‌లో చాలా మార్పులు చేయున్నట్టూ సమాచారం. కేబినెట్‌లో మార్పులు చేస్తే...లీ  షంగ్‌ఫూని దాచేయాల్సిన అవసరం ఏముందన్నది అంతుపట్టని ప్రశ్న. నిజానికి చైనాలో ఇలా కీలక మంత్రులు కనిపించకుండా పోవడం కొత్తేమీ కాదు. ఇప్పటికే విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌ అదృశ్యమయ్యారు. ఆ తరవాత రాకెట్ ఫోర్స్ కమాండర్‌లు కనిపించకుండా పోయారు. ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి లీ షంగ్‌ఫూ అదృశ్యమయ్యారు. ఈ పరిణామాలపై యూఎస్ ఎన్వాయ్ ఎమ్మాన్యుయేల్ స్పందించారు. ఇలా వరుసగా మంత్రులందరూ కనిపించకుండా పోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీని ద్వారా చైనా ఏం సాధించాలనుకుంటోందో అర్థం కావడం లేదని అన్నారు. 


"మూడు వారాలు గడిచినా చైనా రక్షణ శాఖ మంత్రి లీ షంగ్‌ఫూ బయటకు రాలేదు. ఆయన వియత్నాం వెళ్లాల్సి ఉన్నా ఆ పర్యటన రద్దైంది. సింగపూర్ నేవీ చీఫ్‌తోనూ భేటీ కావాల్సి ఉంది. అది కూడా రద్దైంది. ఆయనను హౌజ్ అరెస్ట్ చేసుంటారని అనుమానం కలుగుతోంది"


- ఎమ్మాన్యుయేల్, యూఎస్ కాన్వాయ్ 


ఆరోగ్యం బాగోలేదట..


రెండు నెలల క్రితం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌లోని ఇద్దరు టాప్ జనరల్స్‌ని తొలగించారు. ఇప్పుడు లీ షంగ్‌ఫూని కూడా తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే...ఆయన హెల్త్ కండీషన్ బాలేదని అందుకే ఇంట్లోనే ఉంటున్నారని మరి కొందరు వాదిస్తున్నారు. ఇందులో ఏది నిజమన్నది స్పష్టంగా తేలడం లేదు. దేశ విషయాలన్నీ రహస్యంగా ఉంచే చైనా...ఈ విషయంలోనూ సీక్రెసీ కంటిన్యూ చేస్తోంది. 


జాక్‌మా అదృశ్యం..


చైనా బిలియనీర్ జాక్‌ మా కూడా ఇలాగే అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం సంచలనమైంది. రెండున్నరేళ్ల క్రితం ఓ కార్యక్రమంలో దేశ విధానాలపై విమర్శలు చేశారు జాక్‌ మా. అప్పటి నుంచి అదృశ్యమయ్యారు. ఇన్నేళ్లకు ఈ ఏడాది జులైలో పాకిస్థాన్‌లో పర్యటించినట్టు సమాచారం అందింది. పాకిస్థాన్‌కి చెందిన The Express Tribune వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ (BOI) మాజీ ఛైర్మన్ మహమ్మద్ అజ్ఫర్ అసన్ జాక్‌ మా పర్యటనపై కీలక విషయాలు చెప్పారు. ఆయన జూన్ 29న పాకిస్థాన్‌కి వచ్చారని దాదాపు 23 గంటల పాటు ఇక్కడే ఉన్నారని కన్‌ఫమ్ చేశారు. అయితే...పాకిస్థాన్ ప్రభుత్వంతో కానీ, అక్కడి మీడియాతో కానీ మాట్లాడేందుకు జాక్‌ మా ఆసక్తి చూపలేదట. ఓ ప్రైవేట్ లొకేషన్‌లో ఉండి జూన్ 30న ఓ ప్రైవేట్‌ జెట్‌లో వెళ్లిపోయారని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. జాక్‌ మా ఎందుకు వచ్చారన్నది మాత్రం సీక్రెట్‌గానే ఉంచారు. కానీ...త్వరలోనే పాకిస్థాన్‌కి ఆయన తీపి కబురు చెబుతారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జాక్‌ మా ఒంటరిగా రాలేదట. ఆయనతో పాటు 7గురు బిజినెస్‌మేన్‌లున్నారని సమాచారం. వారిలో 5గురు చైనాకి చెందిన వాళ్లే. అంతకు ముందు నేపాల్‌లో పర్యటించిన జాక్ మా అక్కడి నుంచి నేరుగా పాకిస్థాన్‌కి వెళ్లారు. అక్కడ వ్యాపార అవకాశాలు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకు పర్యటించి ఉంటారని కొందరు ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. 


Also Read: రామ్‌చరిత్‌మానస్‌ సైనైడ్ లాంటిది, హిందూ గ్రంథాల్లో అంతా విషమే - బిహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు