Houty In Red Sea: చిన్న‌ప్పుడు ఎర్ర స‌ముద్రం(Red Sea) గురించి పాఠాల్లో చ‌దువుకున్న విష‌యం గుర్తుండే ఉంటుంది. ఆ త‌ర్వాత పెద్ద‌గా ఈ విష‌యాన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ, గ‌త కొన్ని రోజులుగా ఎర్ర స‌ముద్రం వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఇక్క‌డ జ‌రుగుతున్న సాయుధ పోరు, ముఖ్యంగా హౌతీ(Houty) ఉగ్ర‌వాదులు చేస్తున్న విధ్వంసాలు ప్రధానంగా చ‌ర్చ‌నీయాంశ‌మే కాకుండా.. ప్ర‌పంచ వార్త‌లుగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ఏ దేశాన్ని(Country) క‌దిపినా.. ఎర్ర స‌ముద్రంలో హౌతీల దాడుల గురించే చ‌ర్చ సాగుతోంది. 


ఏంటీ ఎర్ర స‌ముద్రం?


ఆసియా, ఆఫ్రికా ఖండాల మ‌ధ్య ఉన్న తీవ్ర ల‌వ‌ణీయ స‌ముద్రమే ఎర్ర స‌ముద్రం(Red Sea). గ్రీకు దేశానికి చెందిన హిప్పాలస్(Hippalas) అనే నావికుడు ఎర్ర సముద్రం నుంచి భారత దేశానికి(India) సముద్ర మార్గం కనిపెట్టాడని ప‌రిశోధ‌కులు చెబుతారు. ఈ స‌ముద్ర(Sea) విస్తీర్ణం సుమారు 4 ల‌క్ష‌ల 38 వేల కిలో మీట‌ర్లు ఉంటుంది. అంతేకాదు.. పొడ‌వు 2 వేల 250 కిలో మీట‌ర్లు ఉండ‌గా, వెడ‌ల్పు మాత్రం 335 కిలో మీట‌ర్లు ఉంటుంది. ఇక‌, స‌ముద్రం లోతు 2 వేల 211 మీట‌ర్లు ఉంది. రోమ‌న్ సామ్రాజ్యాన్ని పాలించిన ఆగస్టస్(Augustus)  అనే చ‌క్ర‌వ‌ర్తి.. ఎర్ర సముద్రం ద్వారా భారతదేశంతో వ్యాపారం సాగించేవారు. భారత దేశ ఓడరేవుల నుంచి చైనా ఉత్పత్తులు ఎర్ర సముద్రం ద్వారా రోమన్లకు చేరేవి. 


ఇప్పుడు ఏం జ‌రుగుతోంది?


సౌదీ అరేబియా, యెమెన్, ఈజిప్టు, ఇజ్రాయెల్‌, జోర్డాన్, డ్జిబౌటి, ఎరిట్రియా, సోమాలియా, ఈజిప్టు త‌దిత‌ర దేశాలు  ఈ ఎర్ర స‌ముద్ర తీరంలో ఉన్నాయి. ఆయా దేశాల‌కు ప్ర‌పంచ స్థాయిలో వాణిజ్య బంధాల‌ను కూడా ఈ స‌ముద్ర‌మే బ‌లోపేతం చేసింది. ఈ స‌ముద్రం గుండానే రూ.ల‌క్ష‌ల కోట్ల రూపాయల వ్యాపారం నిరంత‌రాయంగా సాగుతోంది. అయితే.. ఇప్పుడు ఈ స‌ముద్రం వివాదంగా మారింది. ఇజ్రాయెల్ పై పాల‌స్తానాలోని హ‌మాస్ ఉగ్ర‌వాదులు దాడులు చేసిన త‌ర్వాత‌.. ఈ దాడుల‌ను ఇజ్రాయెల్ ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. క‌న్నుకు క‌న్ను.. అన్న విధంగా ఎదురు దాడులు చేసి.. హమాస్‌ను నిర్మూలించే దిశ‌గా ఇజ్రాయెల్ భీక‌ర యుద్ధం సాగిస్తోంది. 


స‌మాంత‌ర ప్ర‌భుత్వం


యెమెన్‌లోని మెజారిటీ ప్రాంతాల‌ను త‌మ హ‌స్త‌గ‌తంలో ఉంచుకుని స‌మాంత‌ర ప్ర‌భుత్వాన్ని సాగిస్తున్న హౌతీ ఉగ్ర‌వాదులు.. హ‌మాస్ ఉగ్ర‌వాదుల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. ఈ క్ర‌మంలో ఇజ్రాయెల్‌పై దాడులు చేయ‌కుండా.. చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ప్ర‌పంచ దేశాల నుంచి ఇజ్రాయెల్‌కు సాయం అంద‌కుండా చేయ‌డంతోపాటు.. ప్ర‌పంచ దేశాలు ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉండ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ దేశ‌ల‌ను ప‌రోక్షంగా దెబ్బ కొట్టేలా.. ఎర్ర స‌ముద్రాన్ని అడ్డాగా మార్చుకున్నారు. 


దాడులు ఆగ‌వా?


ఎర్ర స‌ముద్రం గుండా రాక‌పోక‌లు సాగించే వాణిజ్య నౌక‌ల‌ను టార్గెట్ చేసుకుని.. హౌతీ ఉగ్ర‌వాదులు పేట్రేగి పోతున్నారు. దీంతో ఏ దేశం నుంచి ఈ మార్గం గుండా నౌక‌లు ప్ర‌యాణిస్తున్నా.. వాటిని అడ్డుకుంటున్నారు. ధ్వ‌సం చేస్తున్నారు. పౌరుల‌ను సైతం చంపేస్తున్నారు. ఇటీవ‌ల భార‌త్‌కు చెందిన నౌక‌కు కూడా నిప్పు పెట్టిన విష‌యం సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో ఎర్ర సముద్రంలో ఇప్పుడు ర‌క్త‌పు టేరుగా మారింద‌ని ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులు ఆగేవ‌ర‌కు.. హ‌మాస్ తేరుకునే వ‌ర‌కు.. త‌మ యుద్ధం ఆగ‌బోద‌ని హౌతీలు తేల్చి చెబుతున్నారు. 


ప్ర‌పంచ దేశాల ఆందోళ‌న 


ప్ర‌పంచ దేశాల్లో కీల‌క‌మైన అమెరికా, బ్రిట‌న్‌లు.. హౌతీ ఉగ్ర‌వాదుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని క్షిప‌ణి దాడులు కొన‌సాగిస్తున్నాయి. యెమెన్‌లోని హౌతీ ఉగ్ర‌వాద ప్రాబ‌ల్యం.. వారి ఆధిప‌త్యం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో దాడులు ముమ్మ‌రం అయ్యాయి. వీటిని హౌతీ ఉగ్ర‌వాదులు మ‌రింత తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు. తాము ఈ దాడుల‌ను ఉపేక్షించేది లేద‌ని తేల్చి చెబుతున్నారు. దీంతో ఇటు ప్ర‌పంచానికి, అటు హౌతీల‌కు మ‌ధ్య స‌మ‌రం మ‌రింత పెరిగే సూచ‌న‌లే క‌నిపిస్తున్నాయ‌ని.. ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. ఎర్ర స‌ముద్రం ఇప్పుడు ఈ దాడుల కార‌ణంగా నిజంగానే ఎర్ర బార‌డం.. క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న విష‌యం.