India China Conflict: 


న్యోమ ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణం..


భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదం దాదాపు రెండేళ్లుగా కొనసాగుతోంది. గల్వాన్ లోయ ఘటన తరవాత రెండు దేశాల మధ్య వైరం మరింత పెరిగింది. అప్పటి నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది చైనా. అందుకు దీటుగానే బదులిస్తూ వచ్చింది భారత్. అవసరమైతే ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగా ఉంటామని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోడానికీ రెడీగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే దాదాపు 18 రౌండ్ల పాటు చర్చలు జరిగాయి. వీటి వల్ల కొంత మేర ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ పూర్తిగా యుద్ధ వాతావరణం సమసిపోలేదు. అందుకే...G20 సదస్సు ముగిసిన నేపథ్యంలో భారత్ చైనాకి పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చింది. లద్దాఖ్‌లోని న్యోమా వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కంబాయ్ ఎయిర్‌ఫీల్డ్‌ని (Nyoma Combat Airfield) నిర్మించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్‌లో వెల్లడించారు. ఈ సెప్టెంబర్ 12వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. LAC వద్ద ఉద్రిక్తతలు నెలకొన్న ఇలాంటి కీలక తరుణంలో భారత్ ఈ ప్రకటన చేయడం చైనాకు సవాలు విసరనుంది. Border Roads Organization (BRO) తూర్పు లద్ధాఖ్‌లోని న్యోమ బెల్ట్ వద్ద ఈ ఎయిర్‌ఫీల్డ్‌ని నిర్మించనుంది. ఇందుకోసం రూ.218 కోట్లు ఖర్చు చేయనున్నారు. నిజానికి తూర్పు లద్దాఖ్‌లోని Nyoma Advanced Landing Groundని మూడు సంవత్సరాలుగా భారత్ వినియోగిస్తోంది. బలగాలను, మెటీరియల్‌ని తరలించేందుకు ఈ గ్రౌండ్‌ని ఉపయోగించుకుంటోంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఓ కంబాట్ ఫీల్డ్‌నే నిర్మించాలని ప్లాన్ చేస్తుండటం ఉత్కంఠగా మారింది.