Bengalore Woman hit auto driver with slippers: తామేదో భువి నుంచి దిగి వచ్చామని ఆటో డ్రైవర్లపై కొంత మంది రుబాబు చేయడం సిటీల్లో జరుగుతూ ఉంటుంది. అలాంటి వారికి బుద్ది చెప్పేలా మరొకరు అలాంటి పనులు చేయుకుండా కొన్ని చోట్ల చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులోని బెళ్లందూర్ ప్రాంతంలో ఒక మహిళ ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. తర్వాత క్షమాపణ చెప్పిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.
బెళ్లందూర్లోని సెంట్రో మాల్ సమీపంలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద లోకేష్ అనే స్థానిక ఆటో డ్రైవర్ పై పంఖురి మిశ్రా అనే మహిళ దాడి చేసింది. ఆమె బిహార్కు చెందిన ఆమె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. బెళ్లందూర్లోని గ్రీన్ గ్లెన్ లేఅవుట్లో నివాసం ఉంటున్నారు. లోకేష్ వెళ్తున్నసమయంలో పంఖురి మిశ్రా తన భర్తతో కలిసి ఒక టూ-వీలర్పై ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించారు. అక్కడ ఆటో ర్యాష్ గా వచ్చిందని గొడవ పడ్డారు. ఆ గొడవలో మిశ్రా చెప్పు తీసుకుని డ్రైవర్ పైదాడి చేశారు.
వారిద్దరూ దాడి చేసేలా ఉండటంతో ఆటో డ్రైవర్ లోకేష్ ఈ ఘటనను తన ఫోన్లో రికార్డ్ చేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో పంఖురి మిశ్రా కోపంతో తన చెప్పును తీసి అతన్ని పదేపదే కొట్టింది, "వీడియో తీస్తావా? తీయి!" అని హిందీలో అరుస్తూ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆటోడ్రైవర్ బెళ్లందూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పంఖురి మిశ్రాపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెను ఆదివారం అరెస్టు చేశారు, కానీ పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకున్న తర్వాత స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు.
ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రో-కన్నడ కార్యకర్తలు బెళ్లందూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ఈ వివాదం తీవ్రమవడంతో, పంఖురి మిశ్రా ఆటో డ్రైవర్స్ యూనియన్ ద్వారా లోకేష్ను సంప్రదించారు. జూన్ 1, 2025న లోకేష్ కాళ్లపై పడి క్షమాపణ చెప్పింది. నేను బెంగళూరును ,ఇక్కడి ప్రజలను, కన్నడ సంస్కృతిని ఇష్టపడతాను. నా చర్యలకు క్షమించండి" అని కోరింది. ఈ క్షమాపణ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎలాంటి వివాదానికైనా దాడులు పరిష్కారం కాదని .. ఆవేశపడితే ఇలాంటి సమస్యలే వస్తాయని చెబుతున్నారు.