తెలంగాణలో ఎన్నికల సంగ్రామం ముగిసి పట్టుమని నెలరోజులు కాక ముందే మరో సమరం మొదలైంది. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ జెండా ఎగురవేయడానికి అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార,ప్రతిపక్షాలు తమ సంఘాలను గెలిపించుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.


తెలంగాణలోనే అతి పెద్ద బొగ్గు పరిశ్రమ సింగరేణి కావడంతో కార్మికుల్లో పట్టు నిలుపుకోవడానికి అన్ని పార్టిలు సైతం తమ గుర్తింపు సంఘాన్ని గెలిపించుకునేందుకు ప్రచారాలకి వ్యూహ రచిస్తున్నాయి. సింగరేణి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని భావిస్తోంది. అనుబంధ సంఘాన్ని గెలిపించుకోవాలని పట్టుదలతో ఉంది. 


ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్ట్ ఏరియాలో ఘోర పరాజయాన్ని బీఆర్ఎస్ చవిచూసింది. మళ్లీ సింగరేణి ఎన్నికల్లో గెలిచి పట్టు సాధించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికలని సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంది. వామపక్షాలు కూడా ప్రభావవంతమైన పాత్ర పోషించాలని పట్టుదలతో ఉన్నాయి. 


అన్ని పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అగ్ర నేతలతో ప్రచారం చేయించాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ నెల 27 రోజున సింగరేణి ఎన్నికలు జరుగునున్న వేళ తక్కువ సమయంలో సింగరే కార్మికులను తమ వైపు తిప్పుకోవాలని యోచిస్తున్నాయి. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించి కొత్త వాగ్ధానాలు ఇచ్చి ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తవానికి ఈ ఎన్నికలు అక్టోబర్‌లో జరగాలి. కానీ కోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల టైంలో సిబ్బందిని సర్దుబాటు చేయడం సమస్య అవుతుందన్న అధికారుల రిక్వస్ట్‌తో డిసెంబర్‌కు వాయిదా వేసింది కోర్టు. కోర్టు ఆదేశాలతో 27న నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. 


సింగరేణి ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది.  గుర్తులు కూడా  కేటాయించారు. కార్మిక శాఖ అందించిన వివరాల ప్రకారం మొత్తం 39వేల 832 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో పదమూడు గుర్తింపు కార్మిక సంఘాలు పోటీ పడనున్నాయి. కార్మికులని తమకి అనుకూలంగా మలుచుకోవడానికి ప్రణాళికలు,వ్యూహ రచనలో నిమగ్నమై ఉన్నాయి. 


ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్ట్ విస్తరించి ఉన్న 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ పట్టు కోల్పోకుండా రాహుల్ గాంధీతో ప్రచారం చేయించాలని ప్లాన్ చేస్తోంది. పెద్దపల్లిలో భారీ బహిరంగ సభ కూడా పెట్టాలని భావిస్తోంది. ఎన్నిక సందర్భంగా కోల్ బెల్ట్‌లో పాదయాత్ర చేసి రాహుల్‌ గాంధీ సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు. సింగరేణి ప్రాంతంలో బహిరంగ సభలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్,సిపిఐ ఈసారీ ఎలా పోటీ చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది. ఇక గత ఎన్నికల్లో విజయం సాధించిణ బీఆర్‌ఎస్‌ అనుబంధం సంస్థ టీబీజీకేఎస్‌ ఈసారి తన సత్తా చాటుకొని విజయం సాధిస్తుందా అనే చర్చ కూడా సాగుతోంది. 


మరోవైపు సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.