Covid JN.1 Variant Surge: 


కొవిడ్ కలవరం..


ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్ JN.1 కలవర పెడుతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. భారత్‌లోనూ కేరళ,కర్ణాటకలో అలజడి మొదలైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఈ వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. JN.1 వేరియంట్‌ని "Variant of Interest" గా ప్రకటించింది. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే...ఓ వేరియంట్‌ ఇమ్యూనిటీ వలయాన్ని దాటుకుని మరీ వ్యాప్తి చెందడం. ఎప్పటికప్పుడు వైరల్ లక్షణాలనూ మార్చేస్తుందీ వేరియంట్. అందుకు తగ్గట్టుగానే వైద్యంలోనూ మార్పులు చేయాల్సి వస్తుంది. వ్యాక్సిన్‌లు కొత్తగా తయారు చేసుకోవాల్సిందే. అయితే...ప్రజల ప్రాణాలకు ప్రమాదం లేనప్పటికీ ఎక్కువ మందికి సోకే లక్షణముంటుంది ఈ వేరియంట్‌కి. నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం..ఈ వైరస్ స్ట్రెయిన్ చాలా సులభంగా రోగ నిరోధక శక్తిని ఛేదించుకోగలదు. అంతే కాదు. అంతే సులభంగా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. అంటే ఇన్‌ఫెక్షన్ రేటు ఎక్కువ. అలా అని..ఇదేదో ప్రమాదకరమైన జబ్బు అని భయపడాల్సిన పని లేదన్నది నిపుణుల మాట. గతంలో ఈ స్ట్రెయిన్‌ని మరో వేరియంట్‌కి సబ్‌ వేరియంట్‌గా వెల్లడించిన WHO..ఇప్పుడు సెపరేట్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా క్లాసిఫై చేసింది. ఇదే సమయంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు ఈ JN.1 వేరియంట్‌ వ్యాప్తిని అడ్డుకోగలవని వివరించింది. మరణాల సంఖ్యనీ తగ్గించగలదని స్పష్టం చేసింది. 


అమెరికాలో తొలిసారి..


ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో తొలిసారి ఈ వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది. చైనాలోనూ గత వారంలో ఏడుగురు ఇదే వేరియంట్ బారిన పడ్డారు. కరోనా వైరస్‌ రూపాలు మార్చుకుంటూ దాడులు చేస్తూనే ఉంటుందని గతంలోనే WHO వెల్లడించింది. ఇప్పుడు ఈ వేరియంట్‌ ఉన్నట్టుండి వ్యాప్తి చెందడానికి కారణాలేటంన్నదే అందరి ప్రశ్న. దీనిపైనే క్లారిటీ ఇచ్చారు కొవిడ్ టెక్నికల్ హెడ్. ప్రత్యేకంగా ఓ వీడియో విడుదల చేశారు. 


కేరళలో అలెర్ట్..


కరోనా కేసులు (Covid Cases) మరోసారి గుబులు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, కేరళలో బాధితులు పెరుగుతున్నాయి. కేరళలో గత 24 గంటల్లోనే 293 కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం...రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,041 గా ఉంది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 341 మంది కొవిడ్ బారిన పడ్డారు. గత 24 గంటల్లో కేరళలో కొవిడ్ (Kerala Covid Cases) కారణంగా ముగ్గురు మృతి చెందారు. మూడేళ్ల క్రితం కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి ఇప్పటి వరూ ఈ వైరస్‌ కారణంగా కేరళలో 72 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కేరళలో 241 మంది కొవిడ్ నుంచి కోలుకుని హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అయినట్టు అధికారిక లెక్కలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా కేరళలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. 


Also Read: Covid-19: హాస్పిటల్స్‌ని సిద్ధం చేసుకోండి, మాక్ డ్రిల్స్ చేయండి - కొవిడ్ కేసులపై ఆరోగ్యశాఖ ఆదేశాలు