తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వర్షాకాలాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో అయితే మాత్రం మరింత చల్లగా మారింది. వారం రోజులుగా సాయంత్ర అయితే చాలు వర్షాలు కుమ్మేస్తున్నాయి. హైదరాబాద్‌లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అకాల వర్షం రైతులను మాత్రం నిండా ముంచేస్తోంది. 


దక్షిణ మధ్యప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఇంటీరియర్‌ కర్ణాటక, మరాఠ్వాడా వరకు ద్రోణి కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. 


మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం... మూడు రోజుల పాటు కుమ్రంభీం, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్ధిపేట, నాగర్‌కర్నూల్, జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని అంచనా వేస్తోంది. కొన్ని చోట్ల వడగళ్ల వర్షం కూడా పడుతుందని రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. వర్షాలతోపాటు గాలులు కూడా 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతోంది. దీంతో పైన చెప్పిన జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది. 


హైదరాబాద్‌లో వాతావరణం 
ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఈదురు గాలులు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని అధికారులు ఓ ప్రకటనలో చెప్పారు. హైదరాబాద్‌లో నమోదైన గరిష్ణ ఉష్ణోగ్రతలు 30.8 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ట ఉష్ణోగ్రత 22.8 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. తెలంగాణలో చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రత 32.7 డిగ్రీలు మహబూబ్‌నగర్‌లో నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 17.6 డిగ్రీలు మెదక్‌లో రిజిస్టర్ అయింది. ఇవాళ 35 డిగ్రీలు లేదా అంతకంటే కాస్త తక్కుువాగ గరిష్ణ ఉష్ణోగ్రత, 20 డిగ్రీల అంతకంటే కాస్త ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉంది. 
ఆంధ్రప్రదేశ్‌లో కూడా మూడు రోజుల పాటు వర్షాలు కురిసేందుకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.


పలు ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడొచ్చు. గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని అంచనా వేస్తోంది. మంగళవారం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొట్టాయి. పశ్చిమగోదావరి జిల్లా, నంద్యాల, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. 
ఈ మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, సీమలోని కొన్ని జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉంది. పార్వతీపురం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.