Afghanistan Turmoil: అఫ్గాన్‌ సంక్షోభంపై మోదీ కీలక వ్యాఖ్యలు.. ఆసియా దేశాలకు పిలుపు

ABP Desam   |  Murali Krishna   |  17 Sep 2021 12:44 PM (IST)

అఫ్గానిస్థాన్‌లో తిరిగి శాంతిని స్థాపించాల్సిన బాధ్యత ఆసియా దేశాలన్నింటిపైనా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎస్‌సీఓ సదస్సులో భాగంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.

అఫ్గాన్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు

తజికిస్థాన్ రాజధాని దుషాన్‌బేలో జరిగిన షాంఘై సహకార సంఘం (ఎస్‌సీఓ) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వల్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సుకు ఆతిథ్యం ఇచ్చి తజికిస్థాన్‌కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. అఫ్గాన్‌ సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎస్‌సీఓ 20 వార్షికోత్సవాన్ని ఈ ఏడాది జరుపుకుంటున్నాం. ఈ సంఘంలో కొత్తగా చేరిన ఇరాన్‌కు స్వాగతం. సంవాద భాగస్వాములుగా చేరిన సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఖతార్ దేశాలకు సుస్వాగతం. ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలే అతిపెద్ద సవాళ్లు. అఫ్గానిస్థాన్‌లో ఇటీవల జరిగిన పరిణామాలు ఇందుకు నిదర్శనం. మనమంతా ఐకమత్యంగా ఇక్కడ మళ్లీ శాంతిని నెలకొల్పాలి. సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనమంతా ఒకటి కావాలి.

మధ్య ఆసియా దేశాలతో భారత్ మంచి సంబంధాలను కోరుకుంటోంది. భారత్‌తో సంబంధాలను పెంచుకోవడం ద్వారా ఆసియా దేశాలు కూడా మంచి పురోగతి సాధిస్తాయి. ప్రాంతీయ సమగ్రతను అన్ని దేశాలు గౌరవించాలి. 

                               - నరేంద్ర మోదీ, భారత ప్రధాని

ఎస్‌సీఓ 2001లో చైనా నేతృత్వంలో ఏర్పాటైంది. ఇందులో రష్యా, ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌, తజికిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌ సభ్యులుగా ఉన్నాయి. 'నాటో'కు ప్రతిగా సభ్య దేశాల మధ్య రాజకీయ, భద్రత, ఆర్థిక, సాంస్కృతిక సహకారాన్ని సుసాధ్యం చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటైంది. 2017లో రష్యా సహకారంతో భారత్‌ ఎస్‌సీఓలో పూర్తిస్థాయి సభ్యత్వాన్ని సాధించింది. అదే ఏడాది చైనా సహాయ సహకారాలతో పాకిస్థాన్‌ కూడా ఎస్‌సీఓలో చేరింది.

Published at: 17 Sep 2021 12:43 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.