విజయవాడలో వింత కేసు నమోదైంది. ఓ కుక్క తప్పు పని చేసిందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకురాళ్లు కొంత మంది నున్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఆ కుక్క చేసిన నేరం ఏంటో తెలుసా? స్టిక్కర్ ను చింపడం. ‘మా భవిష్యత్ నువ్వే జగనన్న’ అనే స్టిక్కర్‌ను పార్టీ ఆదేశం మేరకు అందరూ ఇళ్లకు అతికిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే శ్రీకాకుళంలోనూ ఓ గోడకు అంటించిన స్టిక్కర్‌ను ఓ కుక్క గోళ్లతో రక్కుతూ చింపింది. దానికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయింది.


ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉండగా.. విజయవాడకు చెందిన టీడీపీ మహిళా నాయకురాళ్ళు చూశారు. వెంటనే వారు నిన్న (ఏప్రిల్ 12) రాత్రి నేరుగా నున్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కుక్కతో పాటు దాని యజమాని మీద కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. దీని వెనుక కుట్ర కోణం ఉందని, టీడీపీ వారు ఆ పని చేసి ఉంటారని వారు అనుమానించారు. ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోను కుక్క తొలగిస్తున్న వీడియోను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది.



కుక్కపై ఫిర్యాదు చేసిన మహిళా నేతలు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అక్రమ కేసులు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డిని అగౌరవ పర్చినందుకు కుక్కపై కేసు పెట్టామని చెప్పారు. తమకు సీఎం మీద గౌరవం ఉంది కాబట్టే, ఆయన ప్రతిష్ఠకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు కుక్కపై చర్యలు తీసుకోవాలని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ఆ కుక్కతో పాటు దానితో పాటు తిరిగే కుక్కలపైనా చర్యలు తీసుకోవాలని వ్యంగ్యంగా మాట్లాడారు.