Vijayawada News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు ప్రమఖ వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ ప్రకటించారు. జులై 23వ తేదీన ఈ కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు ఆయన విజయవాడలో వెల్లడించారు. అదే రోజు గుంటూరు - విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ముందు ప్రజాసింహ గర్జన పేరిట పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో దోపిడీ పాలన నడుస్తోందన్న రామచంద్ర యాదవ్.. అవినీతి రహిత సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూములు, మైనింగ్, ఇసుక పేరుతో అధికార పార్టీ ప్రతినిధులు వేల కోట్లలో దోపీడీ చేస్తున్నారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టుల్లో రూ.30 వేల క్టోల దోపిడీ జరిగిందని ఆక్షేపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు రావడంతో వైసీపీ విఫలం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో అధికార పార్టీ విఫలం అయిందని అన్నారు. అలాగే రాజధానిని కూడా కట్టలేకపోయారని.. మూడు రాజధానులని చెప్పి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్ కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వినియోగిస్తూ... అణిచి వేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఒక ఫ్యాక్షన్ నాయకుడిని అధికారంలోకి తీసుకురావడం దురదృష్టకరం అన్నారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే రాజకీయ మార్పు కావాలన్నారు. తాను తీసుకురాబోయే పార్టీ వల్ల రాష్ట్రంలో నవశకం వస్తుందని వివరించారు.