చార్‌ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే భక్తులకు, అధికారులకు కీలక సూచనలు చేసింది. దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలని సూచించింది.






చార్‌ధామ్ యాత్రకు వచ్చే భక్తులు తప్పనిసరిగా తమతో పాటు కరోనా వైరస్ నెగిటివ్ రిపోర్టులు ఉంచుకోవాలని కోర్టు తెలిపింది. రెండు డోసుల టీకా తీసుకున్న సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేసింది కోర్టు. కరోనా మార్గదర్శకాలను పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. 


అనుమతి ఇచ్చినప్పటికీ..


చార్‌ధామ్‌ను సందర్శించేందుకు హైకోర్టు యాత్రికులను అనుమతించినప్పటికీ  భక్తుల సంఖ్యపై మాత్రం పరిమితులు విధించాలని తెలిపింది. కేదార్‌నాథ్ ఆలయంలో 800 మంది భక్తులు, బద్రీనాథ్ ఆలయంలో 1200 మంది, గంగోత్రిలో 600 మంది, యమునోత్రి ధామ్‌లో 400 మంది భక్తులను మాత్రమే అనుమతించాని హైకోర్టు ఆదేశించింది.


గతంలో కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పును దృష్టిలో పెట్టుకుని చార్‌ధామ్‌ యాత్రకు పర్మిషన్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్‌ధామ్‌లుగా పిలుస్తారు. ఈ ఆలయాలు సంవత్సరంలో ఆరు నెలలు మంచుతో మూసుకుపోయి ఉంటాయి. వేసవి నుంచి ఆరు నెలలు మాత్రమే భక్తులు సందర్శించుకునేందుకు వీలుంటుంది.