US-Pak Relationship: 'పాక్‌తో దోస్తీ ఏ మాత్రం మంచిది కాదు'- అమెరికాకు భారత్ వార్నింగ్!

ABP Desam   |  Murali Krishna   |  26 Sep 2022 02:47 PM (IST)

US-Pak Relationship: పాకిస్థాన్‌తో సంబంధాలు అమెరికా ప్రయోజనాలకు ఎంతమాత్రం ఉపయోగపడవని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు.

(Image Source: PTI)

US-Pak Relationship: పాకిస్థాన్‌-అమెరికా మైత్రి బంధంపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్‌తో సంబంధాలు అమెరికా ప్రయోజనాలకు ఎంతమాత్రం ఉపయోగపడవని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. పాకిస్థాన్‌కు ఎఫ్-16 యుద్ధ పరికరాల విక్రయానికి సంబంధించి అమెరికా చేసిన ప్రకటనను జైశంకర్ తప్పుబట్టారు. వాషింగ్టన్‌లో భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్.. ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ అంశంలో అమెరికా ఎవరినీ మోసం చేయలేదు. తీవ్రవాద సంస్థలపై పోరాటానికే ఎఫ్​-16 యుద్ధ పరికరాలను పాకిస్థాన్‌కు విక్రయిస్తున్నట్లు అమెరికా చెప్పడం హాస్యాస్పదం. ఎఫ్​-16ల సామర్ధ్యం ఏమిటో వాటిని పాక్‌ ఎక్కడ వాడుతుందో అందరికీ తెలుసు. ఈ విషయంలో ఎవరినీ ఫూల్స్‌ చేయలేరు. పాకిస్థాన్‌తో సంబంధాలు అమెరికా ప్రయోజనాలకు ఎంతమాత్రం ఉపయోగపడవు. -                                                                 జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

అందుకోసమే

ఇటీవల పాకిస్థాన్‌కు ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు మరమ్మతు, విడిభాగాల సరఫరా, సాఫ్ట్‌వేర్‌, ఇంజిన్‌ హార్డ్‌వేర్‌ ఆధునికీకరణ, ఎలక్టాన్రిక్‌ పోరాట సామర్థ్యం తదితరాలను సమకూర్చాలని అమెరికా నిర్ణయించింది. ఈ ఒప్పంద విలువ 45 కోట్ల డాలర్లు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్‌కు తోడ్పాటునివ్వడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని అమెరికా తెలిపింది. 

మీడియాపై

అమెరికా మీడియాపై కూడా జైశంకర్‌ విమర్శలు గుప్పించారు. భారత్‌పై పక్షపాత ధోరణిలో అమెరికా మీడియా కథనాలు ప్రచురితం చేస్తోందన్నారు. ఆర్టికల్ 370, కశ్మీర్‌పై వాషింగ్టన్ పోస్ట్ వంటి పత్రికల్లో వచ్చిన కథనాలపై జైశంకర్ మాట్లాడారు.

నేను ఇక్కడి మీడియాను గమనిస్తున్నాను. కొన్ని మీడియా సంస్థల కవరేజ్‌లో పక్షపాత ధోరణి కనిపిస్తోంది. కశ్మీర్‌ అంశం, ఆర్టికల్ 370పై వచ్చిన కథనాలను నేను పరిశీలించాను. ఆర్టికల్‌ 370పై వాస్తవాల వక్రీకరణ జరిగింది. ప్రజలు నిజమేదో, అబద్ధమేదో తెలియక అయోమయానికి గురవుతున్నారు. మీడియాలో రాజకీయాలు నడుస్తుంటాయి. ఏదైనా ఉగ్రవాద ఘటన జరిగితే హత్యకు గురైన వ్యక్తి ఏ మతానికి చెందిన వాడనేది ముఖ్యం కాదు. అలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్న సిబ్బంది, ప్రజలు గురించి కాకుండా ఇంటర్నెట్‌పై నియంత్రణ గురించి వీళ్లు చర్చిస్తున్నారు. ప్రాణ నష్టం కంటే ఇంటర్నెట్‌పై నియంత్రణే ప్రమాదకరం అనే దశకు మీరు చేరుకుంటే నేనేం మాట్లాడగలను?                           -    జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

Also Read: Ghulam Nabi Azad: కొత్త పార్టీ ప్రకటించిన గులాం నబీ ఆజాద్- పేరు ఏంటంటే?.

Also Read: Madurai Student Arrested: షాకింగ్! హాస్టల్‌ అమ్మాయిల నగ్న వీడియోలను బాయ్‌ఫ్రెండ్‌కు పంపిన యువతి!

Published at: 26 Sep 2022 02:27 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.