US Balloons on China Airbase:


అమెరికాయే  బెలూన్‌లు పంపుతోంది: చైనా 


అమెరికా ఎయిర్‌ బేస్‌లో అనుమానాస్పద వస్తువులు చక్కర్లు కొడుతున్నాయి. వరుసగా వాటిని పేల్చేస్తోంది అగ్రరాజ్యం. ఇది కచ్చితంగా చైనా పనే అని తేల్చి చెబుతోంది. నిఘా పెట్టేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని మండి పడుతోంది. ఈ ఆరోపణలపై స్పందించిన డ్రాగన్..కౌంటర్ ఇచ్చింది. అమెరికా తమ ఎయిర్‌బేస్‌లోకి స్పై బెలూన్‌లు పంపుతోందని ఆరోపించింది. జనవరి నుంచి ఇప్పటి వరకూ 10 బెలూన్స్‌ను గుర్తించామని వెల్లడించింది. అమెరికా అక్రమంగా తమ ఎయిర్‌బేస్‌లోకి బెలూన్‌లు పంపుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది నుంచే ఈ నిఘా మొదలైందని...ఇప్పటి వరకూ 10 కన్నా ఎక్కువగా స్బై బెలూన్‌లు పంపిందని చెప్పింది. చైనా అధికారుల అనుమతి లేకుండానే అక్రమంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. ఇప్పటికే అమెరికా-చైనా మధ్య సంబంధాలు తగ్గిపోయాయి. నిత్యం ఏదో విధంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి ఇరు దేశాలు. అగ్రరాజ్యం అనే  బిరుదు కోసం చైనా తపిస్తోంది. అమెరికాను దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. 


కూల్చేస్తున్న అమెరికా..


అమెరికా మరో ఎగిరే వస్తువును కూల్చేసింది. యూఎస్ పరిధిలో గగనతల నిబంధనలను ఉల్లంఘించడంతో నాలుగో వస్తువును షూట్ చేసి పేల్చేసింది. 8 కోణాలతో ఉన్న ఆ వస్తువు.. అమెరికా, కెనడా సరిహద్దుల్లో హ్యురోన్ సరస్సుపై ఎగురుతూ కనిపించింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశానుసారం యూఎస్ ఆర్మీకి చెందిన ఎఫ్ - 16 ఫైటర్ జెట్ దానిని కూల్చేసింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి వస్తువులు అమెరికా గగనతలంలో కనిపించడం, వాటిని పేల్చేయడం ఇది నాలుగోసారి. తాజాగా ఆకాశంలో కనిపించిన వస్తువును సైనిక ముప్పుగా పరిగణించలేదని, అయితే అది పౌర విమానయానానికి ముప్పును కలిగిస్తుందన్న ఉద్దేశంతోనే కూల్చేసినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత వారం రోజుల్లో అమెరికా, కెనడా గగనతలంలో యూఎఫ్ఓలు కనిపించిన కేసులు నాలుగు నమోదు అయ్యాయి. ఈ నాలుగింటిలో 3 ఎగిరే వస్తువులు అమెరికా ఆకాశంలో కనిపించగా, ఒక యూఎఫ్ఓ కెనడియన్ గగనతలంలో కనిపించింది. ఈ నాలుగు ఎగిరే వస్తువులన్నింటిని అమెరికా సైనిక విభాగం యుద్ధ విమానాల ద్వారా కూల్చివేశారు. తాజాగా పేల్చేసిన వస్తువు కెనడా గగనతలం పరిధిలో కనిపించింది. యూఎస్ ఫైటర్ జెట్ ఈ ఎగిరే వస్తువును కూల్చేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఎగిరే వస్తువు కనిపించినట్లు నిర్ధారించారు. పీఎం ట్రూడో అనుమతి మేరకు కెనడియన్ గగనతలంలో గుర్తుతెలియని ఎగిరే వస్తువును కూల్చేసినట్లు తెలిపారు.


భారత్‌నూ టార్గెట్..? 


మరి కొన్ని దేశాలనూ చైనా టార్గెట్ చేసినట్టు ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో భారత్‌తో పాటు జపాన్‌ కూడా ఉంది. ఇప్పటికే ఈ బెలూన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా భారత్‌కు తెలిపింది. వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా డిప్యుటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండీ శెర్మన్ ఈ విషయమై మాట్లాడారు. 


"చైనా స్పై బెలూన్ చాలా రోజులుగా యాక్టివ్‌గా ఉంటోంది. మిలిటరీ పరంగా బలంగా ఉన్న దేశాల సమాచారాన్ని సేకరిస్తోంది. జపాన్, భారత్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పైన్స్‌పై నిఘా పెట్టింది"



-వాషింగ్టన్ పోస్ట్ 


Also Read: Prabhakaran alive: ప్రభాకరన్ బతికున్నారన్న వార్తలు అవాస్తవం, మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి - ABPతో శ్రీలంక సైన్యం బ్రిగేడియర్