UP Cong CM Face: ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఆమే.. స్వయంగా ప్రకటించిన ప్రియాంక!

ABP Desam   |  Murali Krishna   |  21 Jan 2022 05:08 PM (IST)

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీనే కాంగ్రెస్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంకనే వెల్లడించారు.

ప్రియాంక గాంధీ

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా అని తేలింది. యూపీ ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఈరోజు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్​ పార్టీ. దీనికి 'భర్తీ విధాన్'​ అని పేరుపెట్టింది. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం అభ్యర్థి తానేనని పరోక్షంగా ప్రియాంక తెలిపారు.

అవును ఇంకెవరు..?

ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరని కార్యక్రమం తర్వాత ప్రియాంక గాంధీని మీడియా ప్రశ్నించింది. దానికి తెలివిగా ప్రియాకం గాంధీ సమాధానమిచ్చారు.

నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఎక్కడ చూసినా నా ముఖమే కదా కనిపిస్తుంది. ఇదే మీ ప్రశ్నకు సమాధానం.                                     -  ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేస్తారా అనే ప్రశ్నకు మాత్రం అది ఇంకా నిర్ణయించలేదని ఆమె బదులిచ్చారు.

ప్రధాన హామీలు..

అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను అన్నింటినీ భర్తీ చేయాలని కాంగ్రెస్​ తీర్మానించింది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందులో మహిళలకే 8 లక్షలు కేటాయించింది.

మహిళలకు 40 శాతం..

ఈసారి జరగబోయే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు మహిళలకే కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇప్పటికే ప్రకటించిన రెండు జాబితాలలో ఇది నిరూపితమైంది. తొలి జాబితాగా 125 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్. 125 మందిలో 50 మంది మహిళలు ఉన్నారు. రెండో జాబితాలో 16 మందికి చోటిచ్చారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా దేవికి కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.

సోన్‌బాద్రా ఘటనపై గళమెత్తిన నాయకుడికి ఉంబా నియోజకవర్గం టికెట్ ఇచ్చింది. షాజాన్‌పుర్‌ స్థానంలో ఆశా వర్కర్ పూనమ్ పాండేకు అవకాశం ఇచ్చింది. ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లిన పార్టీ నేత సదాఫ్ జాఫర్‌కు లఖ్‌నవూ సెంట్రల్ టికెట్ ఇచ్చారు. 

మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి ఏడు దశల్లో పోలింగ్​ జరగనుంది. ఫిబ్రవరి 10న మొదలై.. మార్చి 7న చివరిదశతో ఎన్నికలు ముగుస్తాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

Also Read: Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. కరోనా కారణంగా 55 పాసింజర్ రైళ్లు రద్దు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

Published at: 21 Jan 2022 05:08 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.