U WIN: ఇప్పటి వరకు గర్భిణులు, చిన్నారులు టీకాలు వేయించుకునేందుకు సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. కాగా, వ్యాక్సిన్ల పంపిణీని పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూ-విన్ పోర్టల్ యాప్‌ను తీసుకొచ్చాయి. ఈ యాప్ ఏ రోజు వ్యాక్సిన్ తీసుకోవాలో బాధితుడి ఫోన్‌కు తెలియజేస్తుంది. ఈ పోర్టల్ గతంలో కరోనా సమయంలో కోవిన్ పోర్టల్ మాదిరిగానే పనిచేస్తుంది. దీని ద్వారా ప్రతి గ్రామంలో గర్భిణులు, చిన్నారులకు 100శాతం టీకాలు వేసే అవకాశం ఉంటుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.


టీకా వివరాలు నమోదు
ప్రతి గర్భిణీ, పిల్లల వివరాలు యూ విన్ పోర్టల్ ద్వారా డిజిటలైజ్ చేస్తారు. దీంతో వాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్ ఇచ్చేందుకు కుటుంబ సభ్యులకు ఈ పోర్టల్ ద్వారా ముందుగానే సమాచారం అందుతుంది. బాధితులు వ్యాక్సిన్ వేసుకునే సమయాన్ని మర్చిపోయినా.. పోర్టల్ ద్వారా అందించిన సమాచారంతో సరైన సమయంలో తీసుకోవచ్చు. డిజిటలైజేషన్ ద్వారా దేశంలో లేదా రాష్ట్రంలో ఎక్కడైనా సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో టీకాలు వేయవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత, ఈ పోర్టల్ ద్వారా సర్టిఫికేట్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పోర్టల్ ను ఆగస్టు చివరి నాటికి ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ఈ ఆన్‌లైన్‌ వ్యవస్థను ఇప్పటికే అన్ని రాష్ట్రాలు (పశ్చిమబెంగాల్‌ మినహా), కేంద్రపాలిత ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్నారు.


జాతీయ టీకా పంపిణీ కార్యక్రమం
 డిఫ్తీరియా, మీజిల్స్, రుబెల్లా వంటి వివిధ వ్యాధులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం గర్భిణులు, పిల్లలకు వివిధ రకాల వ్యాక్సిన్‌లను అందజేస్తోంది. జాతీయ టీకా పంపిణీ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా పంపిణీ చేసే ప్రతి వ్యాక్సిన్ వివరాలను యూ-విన్‌ పోర్టల్ లో  నమోదు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం యు-విన్‌ను తీసుకువస్తోంది. డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లను ఎక్కడి నుండైనా పొందవచ్చు. అంతేకాకుండా ప్రయివేటు కేంద్రాల్లో ఇచ్చే టీకాల నమోదుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.


ఆగస్టు నాటికి అందుబాటులోకి
పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా, జూలై 9, 2024 వరకు 5.33 కోట్ల మంది వ్యాక్సిన్ గ్రహీతల వివరాలను యు-విన్‌లో పొందుపరిచినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆగస్టు చివరి నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పౌరులు వెబ్ పోర్టల్ లేదా యాప్ ద్వారా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు,  అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన అలర్ట్ మెసేజ్ ల రూపంలో వస్తాయి.


 12రకాల టీకాలు 
ప్రభుత్వం ఇన్‌టెన్సిఫైడ్‌ మిషన్‌ ఇంద్రధనుస్సులో భాగంగా గర్భిణులు, ఐదేళ్లలోపు చిన్నారులకు గతంలో అంగన్‌వాడీ సెంటర్‌, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 12 రకాల టీకాలను ఉచితంగా వేసేవారు. టీకా వేసిన అనంతరం వీరి వివరాలను యూ-విన్‌ పోర్టల్‌లో డిజిటలైజేషన్‌ చేస్తారు. బాధితులు వ్యాక్సినేషన్‌ కోసం తమ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో యూ-విన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, వారి వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రాల్లోని హైరిస్క్‌ ఏరియా, ఇటుక బట్టీలు, సంచార జాతుల గుడిసెల వద్ద ఈ టీకాలను తప్పకుండా వేయాలని ఆదేశాలను ప్రభుత్వం ఆదేశించింది.