కరోనాకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ ఎందుకు మద్యమే పెద్ద వ్యాక్సిన్ అని మందుబాబులు లాజిక్‌లు లాగడం మనం చాలా సార్లు చూసి ఉంటారు. కరోనా వ్యాక్సిన్ పేరుతో ఓ బ్రాండ్ కూడా  అమ్మకానికి వచ్చినట్లుగా చూశాం. అందుకే మందు బాబులు అసలైన వ్యాక్సిన్‌ను వేయించుకోవడానికి ఆసక్తి చూపరు. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం మందు వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా సంబంధం లేదు కానీ  నిజమైన కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే.. మద్యం వ్యాక్సిన్ దొరకకుండా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ ప్రకటించింది. ఓ జిల్లాలో అమలు చేయడం కూడా స్టార్ట్ చేసేసింది.


Also Read : టాలీవుడ్ డ్రగ్స్ లింక్ దొరికింది ఎఫ్‌ క్లబ్‌లోనే..!


మద్యం కొనుగోలు చేయాలంటే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలి. షాపు దగ్గరకు వెళ్లి డైలీ కస్టమర్‌నే గురూ అంటే సరిపోదు ఖచ్చితంగా వ్యాక్సిన్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి. రెండు డోసులు వేయించుకున్నట్లుగా ఆధారం చూపించారు. ఆ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌కు మరో ఫ్రూఫ్‌గా ఆధార్ కార్డు కూడా తీసుకెళ్లాలి. అప్పుడు మాత్రమే మద్యం అమ్ముతారు. లేకపోతే లేదు. ఈ విధానం తెలుగు రాష్ట్రాల్లో కాదు కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అక్కడి ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది.  కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలనుకుంది.


Also Read : తమిళనాడు అసెంబ్లీలో పవన్ కల్యాణ్ డైలాగ్


మద్యం దుకాణాలు కూడా కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారాయన్న నివేదికలు రావడంతో సీఎం స్టాలిన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి కొన్ని నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే మద్యం అమ్మాలనే నిర్ణయానికి వచ్చారు. ముందుగా నీలగిరి జిల్లాలో అమలు చేయడం ప్రారంభించారు. నీలగిరి జిల్లాలో మొత్తం 76 మద్యం దుకాణాలు ఉన్నాయి. అక్కడ రోజుకు రూ. కోటి వరకూ లిక్కర్ అమ్మకాలు జరుగుతూ ఉంటాయి.  నీలగిరి జిల్లానే ప్రభుత్వం ఈ ప్రయోగానికి ఎంచుకోవడానికి ఓ కారణం ఉంది అదేమిటంటే.. వ్యాక్సిన్ ఎక్కువ మందికి వేయడం.


Also Read : తెలంగాణ బీజేపీలో పాదయాత్ర జోష్


18 ఏళ్లకు పైబడినవారు 5.82 లక్షల మంది నీలగిరి జిల్లాలో ఉన్నారు. వీరిలో  70శాతం మందికి టీకాలు వేశారు. ఎలాగూ పద్దెనిమిది ఏళ్ల లోపు వారికి మద్యం అమ్మరు కాబట్టి 70 శాతం మంది ప్రజలు మద్యం కొనుగోలుకు అర్హులు కాబట్టి అమ్మకాల మీద కూడా పెద్దగా ప్రభావం పడదన్న ఉద్దేశంతో  ప్రభుత్వం అక్కడ అమలు చేయడం ప్రారంభించింది. పరిస్థితిని బట్టి అన్ని జిల్లాలకు విస్తరించే అవకాశం ఉంది. అంటే ఇంక ఆధార్ కార్డుతో పాటు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కూడా జేబులో పెట్టుకోవాల్సిందేనన్నమాట.