TTD News: ఎన్నికలు సమీపిస్తున్న టైంలో పార్టీ పదవుల్లో కీలకమైన మార్పులు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, జగన్ భావిస్తున్నారట. వివిధ జిల్లాల్లో ఉన్న విభేదాలు, నేతల్లో ఉన్న అసంతృప్తితోపాటు వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు విజయం సాధించేలా ఈ మార్పులు ఉంటాయని చెబుతున్నారు. 


వైసీపీలో ఈ మధ్య కాలంలో కొన్ని జిల్లాల్లో అసంతృప్తులు గళమెత్తుతున్నారు. వారిని కంట్రోల్ చేయడంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వల్ల కావడం లేదని టాక్ బలంగా వినిపిస్తోంది. నేరుగా జగన్ జోక్యం చేసుకునే వరకు అలాంటి వివాదాలు సద్దుమణగలేదు. మొన్నటికి మొన్న మంత్రి వేణుగోపాల్‌, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. వారిని నేరుగా సీఎం జగన్ పిలిచి మాట్లాడాల్సి వచ్చింది. అప్పట్లో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కూడా అసంతృప్తి గళం వినిపించారు. నేరుగా ఎక్కడా పేరు ప్రస్తావించకపోయినా వైవీ సుబ్బారెడ్డిపై ఆగ్రహంతో ఊగిపోయారు. తర్వాత రెండుసార్లు సీఎం జగన్ పిలిచి మాట్లాడి ఆయన్ని కూల్ చేశారు. 


నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్, బాబాయ్ మధ్య వివాదం ఇంకా నలుగుతూనే ఉంది. సీఎం నేరుగా ఇద్దర్నీ కలిపే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. ఇలా ప్రతి జిల్లాకో పంచాయితీ ఉండనే ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఎవరికి వారు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అసమ్మతి గళాన్ని బలంగా విపిస్తున్నారు. దీంతో ప్రాంతీయ సమన్వయకర్తలతోపాతు స్థానికంగా ఉండే నేతలపై కూడా విపరితమైన ఒత్తిడి పెరుగుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్టు చెబుతున్నారు. 


ఈ క్రమంలో మరో కీలక పదవి విషయంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. టీటీడీ ఛైర్మన్ పదవిలో రెండు సార్లు వైవీ సుబ్బారెడ్డే కొనసాగారు. ఈసారి మాత్రం మార్చాలనే ఆలోచన చేస్తున్నారట. పూర్తి రాజకీయ బాధ్యతలు సుబ్బారెడ్డికి అప్పగించి టీటీడీ ఛైర్మన్ పదవిని వేరే వాళ్లకు ఇవ్వబోతున్నారని సమాచారం. 


టీటీడీ పదవి రేసులో చాలా మంది నేతల ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జంగా కృష్ణమూర్తి గుంటూరు జిల్లా నేత. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన జంగా... తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ గుర్తుపైనే రెండుసార్లు ఎమ్మెల్యేగా గురజాల నుంచి విజయం సాధించారు. తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2019లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఓసారి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక వర్గం సభ్యుడిగా కూడా పని చేశారు. అందుకే ఆయన్నే టీటీడీ ఛైర్మన్‌గా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.