Travancore Devasthanam Board Sabarimala Issue: శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలోకి 10 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని బోర్డు నిశ్చయించింది. ఆలయ సంప్రదాయాలు, ఆచారాలను కాపాడాల్సిన చట్టబద్ధమైన బాధ్యత తమపై ఉందని, అందుకే మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. బోర్డు అధ్యక్షుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేవాలయాల్లోని ఆచార వ్యవహారాలను, పవిత్రతను కాపాడటానికే బోర్డు ఏర్పడిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు మహిళలందరికీ ప్రవేశం కల్పించాలని ఇచ్చిన ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, పాత ఆచారాలనే కొనసాగించాలని కోరుతూ కోర్టుకు తమ వాదనను వినిపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
శబరిమల కేసులో తమ అభిప్రాయాన్ని మార్చి 14వ తేదీలోగా తెలియజేయాలని సుప్రీంకోర్టు గతంలోనే బోర్డును కోరింది. 2018లో వెలువడిన తీర్పుపై ప్రస్తుతం తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సమీక్ష నిర్వహిస్తోంది. టిడిబి తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఒక దశలో కోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పిన బోర్డు, ఇప్పుడు మళ్ళీ తన పాత వైఖరి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించడానికే మొగ్గు చూపింది.
శబరిమల అయ్యప్ప స్వామిని నైష్ఠిక బ్రహ్మచారి గా కొలుస్తారని, అందుకే నిర్ణీత వయస్సు గల మహిళలను అనుమతించకూడదనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ విశ్వాసాలను గౌరవించాల్సిన అవసరం ఉందని బోర్డు భావిస్తోంది. కోర్టులో దాఖలు చేయబోయే ఈ అఫిడవిట్ ద్వారా శబరిమల వివాదం మళ్ళీ కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయంపై అటు భక్తులు, ఇటు మహిళా హక్కుల సంఘాల నుండి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
