Top Headlines Today: 


నేడు పట్టాల పంపిణీ


అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. తుళ్లూరు మండలం వెంకటాయ­పాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అక్కడే నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేస్తారు. సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణఆయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరంలో 51,392 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ లబ్ధిదారులంతా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందినవారు. వీల్లకు ఒక్కొక్కరికి సెంటు స్థలాన్ని ఇంటి కోసం అందిస్తోంది ప్రభుత్వం. మొత్తం  25 లేఅవుట్లలో ప్లాట్లు కేటాయించింది. 


అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై నేడు నిర్ణయం


వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు నేటికి(శుక్రవారానికి )వాయిదా వేసింది. ఉదయం నుంచి ఇతర కేసుల విచారణలో వేకెషన్ బెంచ్ బిజీగా ఉంది. అవినాష్ రెడ్డి పిటిషన్ 70 వ నెంబర్ తర్వాత రిజిస్టర్ కావడంతో..  సాయంత్రం వరకూ విచారణకు రాలేదు. విచారణకు వచ్చిన తర్వాత వాదనలకు ఎంత సమయం పడుతుందని ఇరు వర్గాల న్యాయవాదుల్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. తమకు గంట సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. దీంతో శుక్రవారం ఉదయం పదిన్నరకు వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. వాయిదా వేసింది.


నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ప్రారంభం  


ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభంకానుంది. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ గురవారమే ఆమోదం తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తు్న్న జిల్లాతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించగా..అంతర్ జిల్లాల బదిలీల్లో స్పాస్, మ్యూచువల్ బదిలీలకు వీలు కల్పించారు. ఇక జూన్ 10 వరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే రెండేళ్లు పూర్తి అయ్యి ప్రొబేషన్ డిక్లేరైన వాళ్లు బదిలీలకు అర్హులవుతారు. ఈ బదిలీల్లో ఎలాంటి పైరవీలకు తావులేకుండా జరుగుతాయని స్పష్టం చేసింది. బదిలీల ప్రక్రియను ప్రారంభించి వెంటనే చేపట్టాలని సీఎం ఆఫీస్ నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.


ముంబై ఇండియన్స్‌ Vs గుజరాత్‌ టైటాన్స్‌


ఐపీఎల్ 2023సీజన్‌లో ఇవాళ రెండో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగనుంది. ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలవడనున్నాయి. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లలో ముంబై టీమ్ ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి చెన్నైతో ఆఖరిపోరాటం చేయాలని ఆ టీం ప్లాన్ చేస్తోంది. 


నేడు తెలంగాణ పాలిసెట్ ఫలితాలు


తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి శ్రీనాథ్‌ ఫలితాలు విడుదల చేయనున్నారు. పరీక్ష ముగిసిన 8 రోజుల్లోనే రిజల్ట్స్ విడుదల చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17న 296 కేంద్రాల్లో జరిగిన పరీక్షల్లో 98,273 మంది హాజరయ్యారు. ఇందులో 54,700 మంది బాలురు, 43,573 మంది బాలికలు పరీక్ష రాశారు. ఫలితాలను https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను చూసుకోవచ్చు. 


నేటి నుంచి ఐసెట్


ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌-23 నేటి నుంచి ప్రారంభంకానుంది. ఇవాళ రేపు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఓ సెక్షన్, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.