Headlines Today :


వివేక హత్య కేసులో ఇప్పటికే పలు దఫాల విచారణ ఎదుర్కొన్న ఎంపీ అవినాష్ రెడ్డిని ఇవాళ మరోసారి దర్యాప్తు సంస్థ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టైన ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ను కూడా కస్టడీలోకి తీసుకోనున్నారు. వీళ్లందర్నీ కలిపి విచారిస్తారా లేకుంటే విడివిడిగానే విచారిస్తారా అనేది తేలాల్సి ఉంది. 


వీళ్ల ముగ్గురిపై తీవ్ర ఆరోపణలు చేసిన సీబీఐ ఇకపై ఎలా ముందుకు వెళ్తుందనే ఆసక్తి నెలకొంది. అసలు కేసును తప్పుదారి పట్టించడంలో వీళ్ల పాత్ర చాలా కీలకమని సీబీఐ కోర్టులో వాదిస్తూనే ఉంది. హత్యకు కుట్ర చేయడం, ఆధారాలు చేరిపేయడం, గుండెపోటని ప్రచారం చేయడానికి ప్రయత్నించారని కూడా సీబీఐ అభియోగాలు మోపింది. ఇవి ఆరోపణలు కావాని దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొంది. 


నేడు జగన్ సిక్కోలు టూర్


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇవాళ( బుధవారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. సంతబొమ్మాళి మండలంలో మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి సంతబొమ్మాళి మండలం మూలపేటకు హెలీకాఫ్టర్‌లో చేరుకుంటారు. 10.30 – 10.47 గంటల మధ్య మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్ధాపన చేస్తారు. అనంతరం గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు చేస్తారు.11.25 – 11.35 గంటల మధ్య నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్ధాపన చేస్తారు. దీంతోపాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌కు, హిరమండలం వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 11.40 – 12.30 గంటల మధ్య బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం ఉండనుంది. అనంతరం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి, సన్మాన కార్యక్రమం, సమావేశం ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 12 పాయింట్లు లేదా 0.07 శాతం రెడ్‌ కలర్‌లో 17,709 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: టాటా కమ్యూనికేషన్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, అలోక్ ఇండస్ట్రీస్. వీటిపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.


అవలాన్ టెక్నాలజీస్: మంగళవారం ఈ కంపెనీ షేర్ల లిస్టింగ్ తర్వాత, అవలాన్ టెక్నాలజీస్‌లో వాటాను బల్క్ డీల్స్ ద్వారా గోల్డ్‌మన్ సాచ్స్ కొనుగోలు చేసింది.









ICICI లాంబార్డ్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 437 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ. 312 కోట్లతో పోలిస్తే ఇది 40% అధికం.


SBI: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2 బిలియన్‌ డాలర్ల వరకు దీర్ఘకాలిక రుణాల సేకరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది.


పిరమాల్ ఫార్మా: US FDA, పిరమల్ ఫార్మా సెల్లర్స్‌విల్లే (Sellersville) తయారీ ఫ్లాంటుకు ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్ (EIR) జారీ చేసింది. దీంతో తనిఖీ విజయవంతంగా ముగిసింది.


బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6,500 కోట్ల రూపాయల వరకు మూలధన సమీకరణకు బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది.


జిందాల్ స్టెయిన్‌లెస్: ఈ ఏడాది మే 1 నుంచి అమలులోకి వచ్చేలా, 5 సంవత్సరాల కాలానికి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా అభ్యుదయ్ జిందాల్‌ను తిరిగి నియమించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.


ప్రెస్టీజ్ ఎస్టేట్స్: తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ప్రెస్టీజ్ ఎక్సోరా బిజినెస్ పార్క్స్ ద్వారా దశన్య టెక్ పార్క్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లో 51% వాటాను ప్రెస్టీజ్ ఎస్టేట్స్ కొనుగోలు చేసింది.


జైడస్ లైఫ్ సైన్సెస్: ఎస్ట్రాడియోల్ ట్రాన్స్‌డెర్మల్ సిస్టం తయారు చేయడానికి, మార్కెట్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌కు తుది ఆమోదం లభించింది.


మహీంద్ర అండ్ మహీంద్ర: 2027 నాటికి, ప్రయాణీకుల వాహనాల్లో 20-30% వరకు ఎలక్ట్రిక్‌ వాహనాలుగా ఉత్పత్తి చేస్తామని ఈ ఆటోమొబైల్‌ కంపెనీ ప్రకటించింది.


పిడిలైట్ ఇండస్ట్రీస్‌: బేసిక్ అడ్హెసివ్స్‌ నుంచి టెక్నాలజీ, డిజైన్, ట్రేడ్‌మార్క్, కాపీరైట్, డొమైన్ నేమ్‌, ట్రేడ్ డ్రెస్ మొదలైన ఆస్తుల కొనుగోలు కోసం పిడిలైట్ ఇండస్ట్రీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది.


నేడు ఐపీఎల్‌ 2023లో మ్యాచ్‌ల వివరాలు


ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ 2023లో బుధవారం సూపర్ డూపర్‌ కాంటెస్ట్‌ జరగబోతోంది. టేబుల్‌ టాపర్స్‌ రాజస్థాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ (RR vs LSG) తలపడుతున్నాయి. సవాయ్‌ మాన్‌సింగ్‌ ఇందుకు వేదిక. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. రాయల్స్‌పై సూపర్‌ జెయింట్స్‌ ప్రతీకారం తీర్చుకోగలరా?


సంజూ సేన.. డేంజరస్‌!


రాజస్థాన్‌ రాయల్స్‌కు (Rajasthan Royals) ఈ సీజన్లో ఎదురులేదు. ఓటమి తప్పదనుకున్న పరిస్థితుల్లోనూ గెలుపు అవకాశాలు సృష్టించుకుంటున్నారు. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌ భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. ఎవరో ఒకరు ఎప్పుడూ అటాకింగ్‌ మోడ్‌లోనే ఉంటున్నారు. దేవదత్‌ పడిక్కల్‌, రియాన్‌ పరాగ్‌ జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నారు. పడిక్కల్‌ కొంత ఫర్వాలేదు. ఇక కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) బ్యాటింగ్‌కు తిరుగులేదు. ఎలాంటి బౌలరైనా అతడి ముందు దిగదుడుపే! మిడిలార్డర్లో హెట్‌మైయిర్‌ మ్యాచులను ఫినిష్‌ చేస్తున్న తీరు అమేజింగ్‌! అశ్విన్‌, ధ్రువ్‌ జోరెల్‌ బ్యాటుతో ఇంపాక్ట్‌ చూపిస్తున్నారు. ఇక ట్రెంట్‌బౌల్ట్‌ పవర్‌ ప్లేలోనే కనీసం 2 వికెట్లు అందిస్తున్నాడు. సందీప్ శర్మ కట్టుదిట్టమైన లైన్‌ అండ్‌ లెంగ్తులో బంతులు వేస్తున్నాడు. యూజీ, యాష్‌, జంపా స్పిన్‌ బాగుంది. ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటున్నాడు.









లక్నో సూపర్‌ జెయింట్స్ (Lucknow Super Giants) ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతోంది. అయితే కొన్ని మూమెంట్స్‌లో వెనకబడి గెలిచే మ్యాచుల్ని చేజార్చుకుంటోంది. గతేడాది రెండు మ్యాచుల్లోనూ లక్నోపై రాయల్స్‌దే విక్టరీ! అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని రాహుల్‌ సేన పట్టుదలగా ఉంది. కైల్‌ మేయర్స్‌ అటాకింగ్‌తో క్వింటన్ డికాక్ మరికొన్ని మ్యాచుల్లో రిజర్వు బెంచీకి పరిమితం కాక తప్పదు. కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) తన అప్రోచ్‌ మార్చుకోవడం బెటర్‌! మెరుపు ఓపెనింగ్స్‌ ఇవ్వాలి. దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్య ఇంకా స్ట్రగుల్‌ అవుతున్నారు. నికోలస్‌ పూరన్‌ (Nicholas Pooran), మార్కస్‌ స్టాయినిస్‌ (Marcus Stoinis) డిస్ట్రక్టివ్‌గా ఆడటం ప్లస్‌పాయింట్‌. ఆయుష్‌ బదోనీ ఫర్వాలేదు. కృష్ణప్ప గౌతమ్‌ షాట్లు ఆడగలడు. మార్క్‌వుడ్‌ పేస్‌ బాగుంది. అవేశ్‌ మరింత తెలివిగా బౌలింగ్‌ చేయాలి. కుర్రాడు యుధ్‌వీర్‌ సింగ్‌ పేస్‌ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. రవి బిష్ణోయ్‌, కృనాల్‌, కృష్ణప్ప, అమిత్‌ మిశ్రా స్పిన్‌ బాగుంది. అన్ని రకాలుగా కట్టడి చేస్తున్న లక్నో.. ప్రత్యర్థికి ఏదో ఒక చోట మూమెంటమ్‌కు అవకాశం ఇస్తోంది. దీన్ని తగ్గించుకుంటే ఈజీగా గెలవొచ్చు.


నేడు ఢిల్లీ ఎయిమ్స్‌కు నేపాల్ అధ్యక్షుడు 


నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ను బుధవారం (ఏప్రిల్ 19) ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించనున్నారు. ప్రస్తుతం ఆయన ఖాట్మండులోని మహారాజ్ గంజ్ లోని త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో మంగళవారం (ఏప్రిల్ 18) ఆసుపత్రిలో చేరారు. 


ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు చెబుతున్నారు. నెల రోజుల వ్యవధిలో రెండోసారి అధ్యక్షుడి ఆరోగ్యం క్షీణించింది. 78 ఏళ్ల పౌడెల్ ఖాట్మండులోని టీచింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 15 రోజులుగా ఆయన యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారని, అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని మీడియా కథనాలు వెలువడ్డాయి.