Gang Rape In Kolkata law college: సౌత్ కోల్కతా లా కాలేజీలో ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటన జూన్ 25, 2025న సాయంత్రం 7:30 నుండి 8:50 గంటల మధ్య కాలేజీ ఆవరణలో జరిగినట్లు తెలుస్తోంది. 2024 ఆగస్టులో RG కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఒక డాక్టర్ హత్య, అత్యాచారం ఘటన గురించి ఇంకా ప్రజలు మర్చిపోలేదు.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం ప్రధాన నిందితులు తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ (TMCP) దక్షిణ కోల్కతా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31); మొదటి సంవత్సరం విద్యార్థి జైబ్ అహ్మద్ (19), మరొక విద్యార్థి 20 ఏళ్ల ప్రమిత్ ముఖర్జీ. నిందితుల్లో ఇద్దరు, మిశ్రా ,అహ్మద్లను గురువారం సాయంత్రం దక్షిణ కోల్కతాలోని కస్బాలోని సిగ్నల్ క్రాసింగ్ నుండి అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మూడవ నిందితుడు ముఖర్జీని గురువారం తెల్లవారుజామున 12.30 గంటల ప్రాంతంలో అతని నివాసం నుండి అరెస్టు చేశారు. అతని మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. తనపై ఈ ముగ్గురూ గ్యాంగ్ రేప్నకు పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు FIR నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరు పరిచారు.
ఈ ఘటనపై రాజకీయ వివాదం చెలరేగింది. ఈ ఘటనకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పాలన విఫలమైందని ఆరోపించారు.
ఈ ఘటన కోల్కతాలోని బహిరంగ ప్రదేశాలలో మహిళల భద్రతపై మళ్లీ ప్రశ్నలను లేవనెత్తింది. నిందితుల్లో ఒకరన మనోజిత్ మిశ్రా, TMC యువజన విభాగంలో మాజీ అధ్యక్షుడిగా, అలీపూర్ కోర్టులో క్రిమినల్ లాయర్గా పని చేస్తున్నారు. "దీనికి పోలీసులే పూర్తిగా బాధ్యత వహించాలి! మొత్తం కోల్కతా పోలీసులను దిఘా (రథయాత్రలో)కి తీసుకెళ్లారు. కోల్కతా పోలీసులు అక్కడ ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రికి ఆమె కుర్చీలో ఉండే హక్కు లేదు" అని ప్రతిపక్ష నేత సువేందు అధికారి మండిపడ్డారు.
