The Kerala Story:



పన్ను లేదు.. 


The Kerala Story సినిమాపై దేశవ్యాప్తంగా ఎంత రచ్చ జరుగుతోందో చూస్తూనే ఉన్నాం. కేరళలో పలు చోట్ల ఈ చిత్రాన్ని ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నాయి ముస్లిం సంఘాలు. అటు తమిళనాడులోనూ దీనిపై పెద్ద గొడవే జరుగుతోంది. ఈ సినిమాని బ్యాన్ చేయాలని ముస్లిం సంఘాలు కోర్టు వరకూ వెళ్లినా నిరాశే ఎదురైంది. "మేం జోక్యం చేసుకోం" అని కోర్టు తేల్చి చెప్పింది. పొలిటికల్‌గానూ అలజడి రేపింది ఈ సినిమా. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ కావాలనే ఇలాంటి సినిమాలకు సపోర్ట్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా ట్యాక్స్‌ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. స్వయంగా ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఓ వీడియో విడుదల చేసి ఈ విషయం వెల్లడించారు. బీజేపీ సహా మరి కొన్ని హిందూ సంస్థలు కేరళ స్టోరీ సినిమాపై పన్ను వసూలు చేయొద్దని డిమాండ్ చేశాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న చౌహాన్...వెంటనే ఈ ప్రకటన చేశారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా వివాదాస్పదమవుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగానే తెరకెక్కించామని మూవీ టీం చెబుతున్నా ముస్లిం సంఘాలు మాత్రం మండి పడుతున్నాయి. మధ్యప్రదేశ్ మంత్రి రాహుల్ కొఠారీ ఇదే విషయమై శివరాజ్ సింగ్‌ చౌహాన్‌తో పలుసార్లు మాట్లాడారు. పన్ను ఎత్తివేయాలంటూ లేఖలు రాశారు. ఈ మేరకు చౌహాన్ నిర్ణయం తీసుకున్నారు. 


"ది కేరళ స్టోరీ సినిమా వాస్తవాలను కళ్లకు కట్టింది. ఉగ్రవాదులు ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నారో చూపించింది. అందుకే దీనిపై మా రాష్ట్రంలో ట్యాక్స్ విధించకూడదని నిర్ణయం తీసుకున్నాం"


- శివరాజ్ సింగ్ చౌహన్, మధ్యప్రదేశ్ సీఎం