రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్దం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన కొన్ని వేల మంది విద్యార్థులకు చిక్కులు తెచ్చి పెడుతోంది. ఇక్కడ వైద్య విద్యలో సీట్లు రాని వారికి ఉక్రెయిన్ యూనివర్శిటీల్లో తక్కువ ఖర్చుతోనే ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా పెద్ద ఎత్తున తెలుగు విద్యార్థులు అక్కడి యూనివర్శిటీల్లో చేరి చదువుకుంటున్నారు. అనూహ్యంగా యుద్ధమేఘాలు కమ్ముకోవడం .. రాత్రికిరాత్రి రష్యా  బాంబు దాడులు చేస్తూండటంతో అక్కడ విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు..  వారి తల్లిదండ్రులకు ఇక్కడ నిద్రపట్టడం లేదు. 


భారత ప్రభుత్వం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వారిని రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. కానీ రష్యా ఎయిర్‌ స్ట్రైక్స్ చేస్తూండటంతో ఉక్రెయిన్ గగన తలాన్ని కూడా క్లోజ్ చేసింది. దీంతో స్వదేశానికి బయలుదేరిన అనేక మంది ఉక్రెయిన్‌లోనే చిక్కుకుపోయారు. వారితో ఏబీపీ దేశం మాట్లాడింది. వారి ఆవేదనను తెలుసుకుంది. 



" ఉక్రెయిన్‌లో ఇరవై రోజులుగా పరిస్థితి బాగోలేదు. రష్యా బాంబు దాడుల తర్వాత స్వదేశానికి వెళదామన్నా పరిస్థితులు అనుకూలించడం లేదు. ఎవరూ ఫోన్లు చే్యడం లేదు . ఇండియా నుంచి వచ్చిన ఇరవై వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.   ఆంధ్రా స్టూడెట్స్‌ను అయినా త్వరగా ఇండియాకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి " : ఉమా, ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థి 



ఉక్రెయిన్  పై రష్యా బాంబు దాడులు చేస్తోందని తెలిసిన తర్వాత దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లా నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడాలనే విజ్ఞప్తులను ప్రభుత్వ వర్గాలకు చేయడం ప్రారంభించాయి.  నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన యువకుడు అజయ్ వైద్య విద్య అభ్యసించడానికి రష్యా వెళ్ళాడు... మరో మూడు నెలల్లో ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్  పూర్తిచేసుకుని తిరిగి స్వస్థలం మిర్యాలగూడకు రావాల్సి ఉంది. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అక్కడే చిక్కుకున్నాడు. యుద్ధ వాతావరణం నెలకొనడంతో గురువారం రష్యా నుండి తిరిగి ఇండియా రావడానికి సిద్ధం కాగా... ఆకస్మికంగా రష్యా ప్రభుత్వం విమానాలను నిలిపివేయడంతో అజయ్ అక్కడే చిక్కుకుపోయాడు. దీంతో మిర్యాలగూడలో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని వేలాదిగా ఉన్న విద్యార్థులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



  ‘ఇంటర్నెట్ లేదు, విమానాలు లేవు. ఏం చేయాలో దిక్కుతోచట్లేదు’యుక్రెయిన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పౌర విమానాశ్రయాలను మూసేశారు. భారత్‌కు వచ్చేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్న మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు" :  వంశీ కృష్ణ, కార్కివ్‌, ఉక్రెయిన్



ప్రస్తుతానికి   గుంటూరు జిల్లా నుంచి 13, కృష్ణా జిల్లా నుంచి 10, విశాఖ జిల్లా నుంచి 9, తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏడుగురు, కడప జిల్లా నుంచి ఆరుగురు, ప్రకాశం జిల్లా నుంచి ఆరుగురు, కర్నూలు జిల్లా నుంచి ఐదుగురు, చిత్తూరు జిల్లా నుంచి ఐదుగురు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముగ్గురు, నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు, విజయనగరం జిల్లా నుంచి ఒకరు యుక్రెయిన్‌లో ఉన్నట్లు ఏపీఎన్‌ఆర్‌టీఎస్ విభాగం తెలిపింది. 


శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మరియు వీరఘట్టం మండలాలకు చెందిన  మెడికల్ విద్యార్థులు ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్నారు... పాలకొండ వెంకటేశ్వర ల్యాబ్ యజమాని రుద్ర కుమారుడు వంశీకృష్ణ,మరియు వీరఘట్టం మండలం కంబరవలస గ్రామంకు చెందిన నడిమింటి సీతంనాయుడు కుమారుడు కుమారస్వామి అనే విద్యార్థులు ఉన్నారు. అయితే ఎవరూ ఆందో్ళన  చెందాల్సిన పని లేదని.. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని కీవ్‌కు కూడా రావొద్దని స్పష్టం చేసింది. పరిస్తితులు అనుకూలించగానే అందర్నీ భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకు వెళ్తుందని ఎంబసీ తెలిపింది.