Deputy CM Bhatti Comments on State Debts: గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచిందని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. విద్యుత్ కొనుగోలు కోసం భారీగా అప్పులు చేసి వెళ్లారని మండిపడ్డారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు కింద రూ.59,580 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయన్నారు. శనివారం భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టును సందర్శించిన ఆయన, స్వయంగా నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 'భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (Bhadradri Power Station), యాదాద్రి పవర్ స్టేషన్ (Yadadri Power Station) పెడుతున్నామంటూ భారీగా అప్పులు చేశారు. రాష్ట్రాన్ని భయంకరమైన స్థితికి తెచ్చారు. అందుకే అసెంబ్లీలో శ్వేత పత్రాలు విడుదల చేసి కొంత మేర వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ ప్రణాళిక, ముందుచూపుతో అడుగులు వేయాల్సి ఉంది. ప్రతి శాఖలోనూ తాజా పరిస్థితులపై సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పరిస్థితులు తెలుసుకుంటున్నాం.' అని తెలిపారు.


సింగరేణికి రూ.19 వేల కోట్ల బకాయిలు


తమతోనే కరెంట్ అని చెప్పి గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖను అప్పుల్లోకి నెట్టారని సింగరేణికి రూ.19 వేల కోట్లు బకాయి పడ్డారని భట్టి తెలిపారు. అన్ని ప్రాజెక్టులను సందర్శించి వాటిపై సమగ్ర సమాచారం సేకరించి ప్రజల ముందుకు తెస్తామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.81,514 కోట్ల అప్పులు చేసిందని, ప్రభుత్వం నుంచి డిస్కంలకు రూ.28 వేల కోట్ల బకాయి పడి ఉన్నామని వివరించారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు రూ.50 వేల కోట్ల అప్పు ఉందని అన్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుకొని పర్యావరణానికి హాని కలగకుండా నిపుణుల సూచనలతో ముందుకు వెళ్తామన్నారు.


Also Read: Former DSP Nalini : వేద ప్రచారం కోసం సాయం చేయండి - సీఎం రేవంత్‌ను కోరిన మాజీ డీఎస్పీ నళిని