Annamalai steps back from election duty:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఎన్డీయే కూటమిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీని ఉరకలెత్తించిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై, ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ఏఎంఎంకే  అధినేత టీటీవీ దినకరన్ ఇద్దరూ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.  అన్నాడీఎంకే  తో పొత్తు కుదిరినందున సీట్ల సర్దుబాటు , అంతర్గత సమీకరణాల దృష్ట్యా వీరిద్దరూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.  పళని స్వామికి.. వీరికి సరిపడని రాజకీయాలు ఉన్నాయి. 

అన్నా డీఎంకేతో పొత్తు కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అన్నామలై గతంలో వైదొలగారు.  ఎడప్పాడి పళనిస్వామి  నేతృత్వంలోని అన్నాడీఎంకేతో పొత్తు పునరుద్ధరణకు అన్నామలై వైఖరి కొంత అడ్డంకిగా ఉందని భావించిన బీజేపీ అధిష్టానం, అతన్ని పక్కన పెట్టింది. ఇప్పుడు ఏకంగా ఎన్నికల బాధ్యతల నుంచే తప్పించింది. రాష్ట్రంలో కూటమి గెలుపు కోసం ఆయన పర్యవేక్షణ బాధ్యతలకు మాత్రమే పరిమితం కానున్నారు.

మరోవైపు, ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు.   దేని  జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తన శక్తియుక్తులను అభ్యర్థుల గెలుపు కోసమే వెచ్చిస్తానని, పార్టీ కేడర్‌ను ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చూడటమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎన్డీయే కూటమికి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వం వహిస్తారని ఆయన స్పష్టం చేయడం ద్వారా కూటమిలోని ఐక్యతను చాటిచెప్పారు.                    

ఈ ఇద్దరు కీలక నేతలు పోటీ నుంచి తప్పుకోవడం అధికార డీఎంకే  కూటమికి వ్యూహాత్మకంగా లాభిస్తుందా లేక ఎన్డీయేలోని ఇతర అభ్యర్థులకు బలం చేకూరుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అటు విజయ్ నేతృత్వంలోని టీవీకే  పార్టీ కూడా బలంగా పుంజుకుంటున్న తరుణంలో, క్షేత్రస్థాయిలో ఓట్ల చీలికను అరికట్టడమే లక్ష్యంగా బీజేపీ-అన్నాడీఎంకే కూటమి ఈ  త్యాగాల ' వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.