Tamil Nadu man drops Rs 4 crore documents in hundi: తండ్రికి కోపం వచ్చినా సరే ఆస్తులు ఇవ్వకుండా ఉండలేరని అనుకుంటారేమో కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తనకు నచ్చని పని చేశారని కూతుళ్లకు కాకుండా ఆలయానికి ఆస్తులు రాసిచ్చేశాడు ఓ తండ్రి. ఇప్పుడా తండ్రి కుమార్తెలు మా ఆస్తి మాకివ్వాలని ఆలయ పెద్దల్ని అడుగుతున్నారు. విషయం కోర్టుకు చేరింది.                

తమిళనాడులోని తిరువణ్ణామలై లో  ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి తన కుమార్తెలతో ఆస్తి వివాదం కారణంగా రూ. 4 కోట్ల విలువైన ఆస్తి డాక్యుమెంట్లను ఆలయ హుండీలో వేశారు.  ఎస్. విజయన్ అనే  రిటైర్డ్ ఆర్మీ అధికారి. తన భార్య నుండి విడిపోయి, ఒంటరిగా జీవిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారు చెన్నై, వేలూరులో నివసిస్తున్నారు . కుమార్తెలకు ఆస్తులు ఇవ్వకూడదనుకున్న ఆయన  రూ. 3 కోట్ల విలువైన   రెండు అంతస్తుల భవనం, రూ. 1 కోటి విలువైన మరో 1,500 చదరపు అడుగుల స్థలాలకు చెందిన  డాక్యుమెంట్లను అరుళ్మిగు రేణుగాంబాళ్ అమ్మన్ ఆలయంలోని ఒక హుండీలో వేశారు.             

డాక్యుమెంట్లతో పాటు, విజయన్ ఒక  లేఖను కూడా హుండీలో వేశారు, ఇందులో తన ఆస్తిని ఆలయానికి స్వచ్ఛందంగా విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. "నా పిల్లలు నా రోజువారీ అవసరాల కోసం కూడా నన్ను పట్టించుకోలేదు" అని ఆ లేఖలో రాశారు. ఆలయంలో 11 హుండీలు ఉన్నాయి. ప్రతి రెండు నెలలకు ఒకసారి భక్తుల విరాళాలను లెక్కించడం సంప్రదాయం. జూన్ 24, 2025న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో, ఒక హుండీని తెరిచినప్పుడు, ఆలయ సిబ్బంది ఈ ఆస్తి డాక్యుమెంట్లను కనుగొన్నారు.                     

 ఇద్దరు కుమార్తెలు తన ఆస్తిని తమకు బదిలీ చేయమని విజయన్ పై ఒత్తిడి చేశారు. అయితే తాను నిర్ణయాన్ని తిరిగి తీసుకోను. నేను ఆలయ అధికారులతో మాట్లాడి, చట్టప్రకారం ఈ ఆస్తులను ఆలయం పేరిట రిజిస్టర్ చేస్తానని విజయన్ చెబుతున్నారు. డాక్యుమెంట్లు హుండీలో వేసినంత మాత్రాన ఆ ఆస్తులు ఆలయపరం కావు.  విజయన్ కుమార్తెలు ఈ విరాళాన్ని వ్యతిరేకిస్తున్నారు . ఆస్తి డాక్యుమెంట్లను తిరిగి పొందేందుకు కోర్టుకెళ్లారు. 

హుండీలో డాక్యుమెంట్లను వేయడం వల్ల ఆస్తి ఆలయ ఆధీనంలోకి   రాదని హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్స్ (HR&CE) అధికారులు స్పష్టం చేశారు. ఆస్తిని చట్టప్రకారం రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లను విజయన్‌కు తిరిగి ఇవ్వలేమని ఆలయ అధికారులు చెబుతున్నారు.  విజయన్ ఆస్తిపై ఏకైక యజమాని అయితే, ఈ విరాళం చట్టపరంగా చెల్లుబాటు కావచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కానీ కుమార్తెలు కోర్టుకు వెళ్తున్నారు.