Tamil Nadu Covid Cases: తమిళనాడులో కరోనా కలకలం రేపింది. చైనా నుంచి కొలంబో మీదుగా తిరిగి వచ్చిన ఒక మహిళ,ఆమె ఆరేళ్ల కుమార్తెకు కరోనా పాజిటివ్ వచ్చింది. తమిళనాడులోని మధురై విమానాశ్రయంలో వీళ్లకు కొవిడ్-19 పరీక్ష చేశారు. 


మధురై సమీపంలోని విరుదునగర్‌కు చెందిన మహిళ, ఆమె కుమార్తెకు మంగళవారం ల్యాండ్‌ అయినప్పుడు విమానాశ్రయంలో RT-PCR పరీక్షను నిర్వహించారు. ఫలితాల్లో కరోనాకు పాజిటివ్‌గా తేలినట్లు అధికారి తెలిపారు. వీరిద్దరూ విరుదునగర్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జినోమిక్ సీక్వెన్సింగ్ కోసం వారి నమూనాలను ల్యాబ్‌కు పంపనున్నారు. 


కేసులు


తమిళనాడులో మంగళవారం 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 51 వద్ద ఉంది. చైనాలో అకస్మాత్తుగా కరోనా వైరస్ కేసులు పెరగడంతో తమిళనాడు ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలోని నాలుగు విమానాశ్రయాలకు వచ్చిన ప్రయాణికులపై నిఘా పెట్టింది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహిస్తోంది.


రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్.. రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో కొవిడ్-19 మాక్ డ్రిల్‌ను మంగళవారం పరిశీలించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. 


ఇప్పటికే ఉన్న వేరియంట్‌లను పర్యవేక్షించడానికి, కొత్త వేరియంట్‌లను గుర్తించడానికి జినోమిక్ సీక్వెన్సింగ్ (డబ్ల్యుూజీఎస్) కోసం కొవిడ్-19-పాజిటివ్ నమూనాలను ప్రభుత్వ ల్యాబ్‌కు పంపాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లను ఆదేశించింది.


పరీక్షించడం, ట్రాక్ చేయడం, చికిత్స చేయడం, టీకాలు వేయడం, కొవిడ్ నిబంధనలు పాటించడం వంటి 5 స్టెప్స్ వ్యూహంపై దృష్టి సారించింది.


కేంద్రం


పొరుగున ఉన్న చైనాతో సహా అనేక దేశాల్లో కొవిడ్ -19 కేసులు పెరగడంతో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలలో నిఘాను కఠినతరం చేసింది కేంద్రం. ఇటీవలే మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. అన్ని విమానాశ్రయాల్లో విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారందరికీ కేంద్రం కొవిడ్-19 పరీక్షను తప్పనిసరి చేసింది. 


Also Read: China Covid Battle: చైనాలో ఆసుపత్రులన్నీ కొవిడ్ రోగులతో హౌస్‌ఫుల్!