TN Ganesh Chaturthi 2021: చవితి వేడుకలు రద్దు చేసినా సీఎంపై ప్రశంసల జల్లు

ABP Desam Updated at: 08 Sep 2021 01:39 PM (IST)
Edited By: Murali Krishna

బహిరంగ చవితి వేడుకలను నిషేధించినప్పటికీ తమిళనాడు సీఎం స్టాలిన్ ను ప్రశంసిస్తున్నారు విగ్రహ తయారీదారులు. ఎందుకంటే వారికి రూ.5 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.

సీఎం స్టాలిన్ పై ప్రశంసలు

NEXT PREV

తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గణేశ్ విగ్రహాలు తయారు చేసే కళాకారులకు ఒక్కొక్కరికి రూ.5వేల ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్రంలోని 3 వేల మంది దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా వినాయక చవితికి బహిరంగ వేడుకలను రద్దు చేస్తూ ఇటీవల సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు.


ఆర్థిక సాయం..


వినాయక చవితి వేడుకలను రద్దు చేయడం వల్ల దీన్నే నమ్ముకొని బతికే ఎన్నో వేలమంది కళాకారులు ఆందోళన చెందారు. అయితే వారికి రూ.5 వేలు సాయం చేసి ఆదుకుంటామని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. గణేశ్ చతుర్థిని బహిరంగంగా జరుపుకునేలా అనుమతి ఇవ్వాలని అసెంబ్లీలో భాజపా డిమాండ్ చేసింది. దీనిపై స్పందిస్తూ సీఎం కీలక ప్రకటన చేశారు.



ఇప్పటికే బతుకుతెరువు కోల్పోయిన 12 వేలమంది కుమ్మరివాళ్లకు రూ.5 వేల ఆర్థికం సాయం ప్రభుత్వం ఇస్తోంది. గణేశ్ వేడుకలు రద్దు చేయడం వల్ల నష్టపోయే కళాకారులకు కూడా రూ.5 వేలు ఇచ్చి ఆదుకోవాలని మేం నిర్ణయించాం. దీని వల్ల 3 వేల మంది లబ్ధి పొందుతారు.                        -      ఎమ్ కే స్టాలిన్, తమిళనాడు సీఎం


స్టాలిన్ నిర్ణయంపై విగ్రహ తయారీదారులు హర్షం వ్యక్తం చేశారు. వేడుకలు రద్దు చేసినప్పటికీ తమ గురించి ఆలోచించి ఈ సాయం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.


వేడుకలు రద్దు..



కరోనా వ్యాప్తి కారణంగా బహిరంగ ప్రదేశాల్లో గణేశ్ విగ్రాహాలు పెట్టడం, నిమర్జన కార్యక్రమాలను రద్దు చేసింది తమిళనాడు సర్కార్. పండుగను ఇంటివద్దే జరుపుకోవాలని సూచించింది. ఒక్కొక్కరుగా వెళ్లి విగ్రహాలను నిమర్జనం చేయాలని పేర్కొంది. చెన్నై వాసులు.. బీచ్ లో విగ్రహాలు నిమర్జనం చేయరాదని స్పష్టం చేసింది.


కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న  కారణంగా పండుగలను బహిరంగంగా జరుపుకోకుండా చూడాలని కేంద్ర హోంశాఖ ఇటీవల రాష్ట్రాలకు తెలిపింది. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆదేశాలు పాటించాలని వెల్లడించింది. ఇందుకోసమే సెప్టెంబర్ 10న వచ్చిన వినాయకచవితి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.



ఓనం, బక్రీద్ పండుగలకు అనుమతి ఇవ్వడం వల్ల కేరళలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. తమిళనాడులో వైరస్ ఇంకా పూర్తిగా పోలేదు. కనుక ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వినాయకచవితి సహా సెప్టెంబర్ 15 వరకు జరుపుకోబోయే అన్ని పండుగలపై ఆంక్షలు విధించాం. అయితే బహిరంగ వేడుకలను మాత్రమే రద్దు చేశాం. కొవిడ్ నియమాలు పాటిస్తూ ఇంట్లో పండుగను ఆనందంగా జరుపుకోండి.                                         -        ఎమ్ కే స్టాలిన్, తమిళనాడు సీఎం


Published at: 08 Sep 2021 01:36 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.