Nupur Sharma Gets Gun License:


వ్యక్తిగత రక్షణకు..


మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సస్పెండ్ అయిన మాజీ బీజేపీ నేత నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ తీసుకున్నారు. వ్యక్తిగత భద్రతకు గన్‌ కోసం అప్లై చేయగా పోలీసులు అనుమతినిచ్చారు. తనను చంపేస్తానని చాలా మంది బెదిరిస్తున్నారని అందుకే గన్‌ క్యారీ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని పోలీసులకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు నుపుర్ శర్మ. కేవలం తన ప్రాణాలు రక్షించుకునేందుకు మాత్రమే గన్‌ లైసెన్స్ కావాలని కోరుతున్నట్టు చెప్పారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టిన పోలీసులు మొత్తానికి ఆమె పిటిషన్‌కు పాజిటివ్‌గా స్పందించారు. గన్ లైసెన్స్ ఇచ్చారు. మొత్తం 8 రాష్ట్రాల్లో దాదాపు 10 కేసులు నుపుర్‌పై నమోదయ్యాయి. అయితే...అన్ని కేసులనూ సుప్రీం కోర్టు ఢిల్లీకి బదిలీ చేసింది. భారత్‌లోనే కాకుండా...విదేశాల నుంచి కూడా నుపుర్ శర్మకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ ఘటనతో పలు చోట్ల హత్యలు కూడా జరిగాయి. నుపుర్‌కు సపోర్ట్‌గా మాట్లాడినందుకు పలువురు హత్యకు గురయ్యారు. బీజేపీ వెంటనే అలెర్ట్ అయ్యి..ఆమెను
పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయినా...అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. ఆ తరవాత ఆమె తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించినా వివాదం సద్దుమణగలేదు. 


హత్య చేసేందుకు కుట్ర..


గతేడాది నుపుర్ శర్మ హత్యకు కుట్ర జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ టెర్రరిస్ట్ ఆమెను చంపేందుకే అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డాడని రాజస్థాన్ పోలీసులు వెల్లడించారు. పాకిస్థాన్‌లోని తెహ్‌రీక్ ఏ లబ్బైక్ సంస్థ ఈ హత్యకు ప్లాన్ చేసినట్టు నిర్ధరించారు. ఈ కుట్రకు పాల్పడిన వ్యక్తి పేరు రిజ్వాన్‌గా గుర్తించారు. భారత్‌లోకి అక్రమంగా వచ్చి ఆమెను హత్య చేయాలని చూశారని రాజస్థాన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్ సెంగతిర్ వెల్లడించారు. సీఐడీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌తో పాటు ఇండియన్ ఆర్మీ, ఇంటిలిజెన్స్ బ్యూరో రిజ్వాన్‌ను విచారిస్తున్నట్టు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోవటానికి తెహ్‌రీక్ సంస్థే కారణమని, చాలా మంది ప్రజల ప్రాణాలు తీసిందని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని శ్రీగంగా నగర్‌లో రిజ్వాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే...మహ్మద్ ప్రవక్త విషయంలో నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పాలని సుప్రీం తెలిపింది. తనకు ఉన్న ప్రాణ హాని, అత్యాచార బెదిరింపులు వస్తున్నందున దేశవ్యాప్తంగా తనకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల ఎఫ్‌ఐఆర్‌లను దిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ నుపుర్ శర్మ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా భాజపా బహిష్కృత నేతపై సుప్రీం కోర్టు మండిపడింది.


" నుపుర్ శర్మ నోటి దురుసు.. దేశాన్ని రావణ కాష్టంలా మార్చింది. ఆమె వ్యాఖ్యలే ఉదయ్‌పుర్ ఘటనకు కారణం. నుపుర్ శర్మ యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే. ఒక అజెండాను ప్రచారం చేయడం తప్ప, టీవీ ఛానల్, నుపుర్ శర్మల డిబేట్‌ వల్ల దేశానికి ఒరిగిందేంటి?                                                                     "
-సుప్రీం ధర్మాసనం


Also Read: Army Chief Manoj Pandey: యుద్ధమే వస్తే అందుకు మేం రెడీగానే ఉన్నాం, ప్రస్తుతానికైతే అంతా అదుపులోనే - ఆర్మీ చీఫ్