Jammu Kashmir Survey:


పాత సర్వే..


పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పు పుట్టట్లేదు. ఉన్న అప్పులు తీర్చే మార్గమూ కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కశ్మీర్‌ గురించి పంతం మాత్రం మానడం లేదు. కానీ...క్షేత్రస్థాయిలో చూస్తే...పాక్ సర్కార్‌కు భిన్నంగా కశ్మీర్ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎంత మంది కశ్మీరీలు పాకిస్థాన్‌లో ఉండాలని కోరుకుంటున్నారనే అంశంపై ఓ సర్వే చేపట్టగా సంచలన విషయాలు వెల్లడయ్యాయి. కశ్మీర్‌ విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంటుంటే కశ్మీరీలు మాత్రం "పాకిస్థాన్‌తో మాకు వద్దే వద్దు" అని తేల్చి చెప్పారు. అయితే..ఇది ఇప్పుడు జరిగిన సర్వే కాదు. 13 ఏళ్ల క్రితం 2009లో చేసిన సర్వే. అప్పటికే కశ్మీరీలు పాకిస్థాన్‌తో విసిగిపోయారు.


లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కు చెందిన ఓ స్కాలర్ రాబర్ట్ బ్రాడాక్ ఈ సర్వే చేశారు. ఇందులో భాగంగా...3,744 మందిని ఇంటర్వ్యూ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజల్లో దాదాపు 44% మంది స్వతంత్రత కోరుకున్నారు. అదే భారత్‌లోని కశ్మీర్‌ ప్రజల్లో 43% మంది స్వాతంత్య్రం కోరుకున్నారు. పాకిస్థాన్‌లో కలిసేందుకు కశ్మీరీలు ఏ మాత్రం ఆసక్తి చూపలేదని ఈ సర్వేలో స్పష్టమైంది. స్వతంత్రంగా ఉండేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపారు. అయితే...కేంద్రం 2019లో కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసింది.


దారుణంగా పాక్ స్థితి..


పాకిస్థాన్‌ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అప్పుల కుప్పుల్లో కూరుకుపోయిన ఆ దేశం ( Pakistan Crisis ) ఇప్పట్లో ఆ ఊబి నుంచి బయటపడేలా కనిపించడం లేదు. ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలంటూ IMFని అర్థిస్తోంది పాకిస్థాన్. కానీ...IMF మాత్రం చాలా విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది. 7 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు సిద్ధంగానే ఉన్నా...అందుకు తగ్గ అర్హతలన్నీ పాక్‌కు ఉన్నాయా లేదా అని సమీక్షిస్తోంది.  ఈ లోన్ ఇచ్చేందుకు ఇప్పటికే 8 సార్లు పాక్‌కు వచ్చిన IMF బృందం...ఇప్పుడు తొమ్మిదో సారీ సమీక్ష జరుపుతోంది.  దీనిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఆర్థిక మంత్రి ఇషాక్ దర్‌కు IMFని ఎదుర్కోటం చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తమకు గడ్డు కాలం అంటూ వ్యాఖ్యానించారు. 


IMF కండీషన్స్..


రుణ భారం మోయలేక పాక్‌ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. IMFరివ్యూ  జరిగిన ప్రతిసారీ గండం దాటినట్టే ఉంటోందని పాక్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశ మారక ద్రవ్య నిల్వలు 3.09 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. మరో 18 రోజుల పాటు దిగుమతులకు మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. ఆ తరవాత పరిస్థితి ఏంటన్నది ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. IMF రివ్యూఆధారంగా చూస్తే...పాక్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పెట్రోల్ రేట్లను 16% పెంచాలి. ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్నీ 30% పెంచాలి. వీటిని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. కానీ..IMF మాత్రం ఈ కండీషన్స్‌ ఓకే అంటేనే లోన్ ఇస్తామని తేల్చి చెబుతోంది.