Sudha Murthy Success Behind Story: 'భ‌ర్త ఉన్నత స్థాయిలో ఉంటే.. భార్య క‌ష్ట ప‌డ‌కూడ‌ద‌ని ఎవ‌రైనా చెప్పారా?. నా ఆలోచ‌న‌లు నావి. నేను కూడా క‌ష్ట‌ప‌డ‌గ‌ల‌ను. ఆదాయం కోస‌మే కాదు.. ఆత్మ‌ సంతృప్తి కోసం కూడా ఉద్యోగం చేయొచ్చు. నా ప‌రిధిలో నేను చూసిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు నా వంతుగా ఈ స‌మాజానికి ఏమైనా చేయాల‌ని అనుకున్న‌ప్పుడు.. కష్టపడడంలో త‌ప్పేముంది?'- అని నిర్మొహ‌మాటంగా త‌న మ‌న‌సులోని సేవా గుణాన్ని సుధాధార‌గా అభివ్య‌క్తీక‌రించ‌గ‌ల నేర్పు, కూర్పు సొంతం చేసుకున్న ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త డాక్ట‌ర్ సుధామూర్తి(Dr Sudhamurty). ఆమె ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు డాక్టర్ నారాయణమూర్తి సతీమణి. పువ్వు పుట్ట‌గానే ప‌రిమ‌ళించిన‌ట్టుగా ఆమె త‌న బాల్యం నుంచే స్వ‌తంత్ర భావాలు ఏర్ప‌రుచుకున్నారు. తండ్రయినా.. భ‌ర్తయినా.. సంపాదించి తీసుకువ‌స్తున్నారు క‌దా.. త‌ర‌గ‌ని సంప‌ద మ‌న సొంతం క‌దా.. అని ఆమె చేతులు ముడుచుకుని గ‌డ‌ప‌లోప‌లే ప‌రిమితం కాలేదు. త‌న ఆలోచ‌న‌ల‌కు ప‌దును పెట్టారు. త‌ను కూడా.. స్వతంత్రంగా ఎద‌గ‌గ‌ల‌న‌ని భావించి.. ఆ మేర‌కు ఆమె త‌ను ఎంచుకున్న రంగంలోకి విశేష కృషి చేశారు. అంతేకాదు.. పురుషాధిక్య స‌మాజాన్ని ప్ర‌శ్నించి మ‌రీ అవ‌కాశాలు అందిపుచ్చుకున్నారు.


సుధామూర్తి ఈ వయసులోనూ రోజుకు 18 గంటలు నిర్విరామంగా పని చేస్తూ నేటి యువతకు ఏ మాత్రం తీసిపోని విధంగా కృషి చేస్తున్నారు. మహిళలు దేనిలోనూ తీసిపోరని.. పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదంటూ ఆమె ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అంత‌ర్జాతీయ‌ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా సుధామూర్తి జీవిత విశేషాలు, ఆమె విజయం వెనుక కథను ఓసారి చూస్తే..


ఎవ‌రీ సుధామూర్తి? 


ఈ ప్ర‌శ్న‌కు సాధార‌ణంగా అంద‌రూ చెప్పే స‌మాధానం ఇన్ఫోసిస్ నారాయ‌ణ మూర్తి స‌తీమ‌ణి అనే!. కానీ, దీన్ని ఆమె ఒప్పుకోరు. పైగా నొచ్చుకుంటారు కూడా!! ఎందుకంటే.. స‌హ‌జ సిద్ధంగా మెరిసే బంగారానికి చేదోడు న‌గిషీలెందుక‌ని ప్ర‌శ్నిస్తారు. నిజ‌మే. వ్య‌క్తిగ‌తంగా ఆమె సాధించిన ల‌క్ష్యాలు.. చేరుకున్న శిఖ‌రాగ్రాల‌ను ప‌రిశీలించిన‌ప్పుడు.. నారాయ‌ణమూర్తి స‌తీమ‌ణి అని అన‌లేం కూడా. ఆ విధంగా త‌న బాల్యం నుంచి  వ్య‌క్తిగ‌త కృషితో అంచ‌లంచెలుగా ఎదిగారు సుధామూర్తి. అందుకే.. త‌న‌ను తాను సేవా భావం గ‌ల కృషీ వ‌లునిగా పిలిస్తే మురిసిపోతారు. మైమ‌రిచిపోతారు. కర్ణాటక రాష్ట్రం హావేరీ జిల్లా షిగ్గాన్ లో 1950, ఆగస్టు 19న ఆమె జ‌న్మించారు. విద్యార్థి ద‌శ నుంచే నైపుణ్యాల‌కు ప‌దును పెట్టారు. రాజీ ధోర‌ణి లేని కృషితో ముందుకు సాగారు. బి.వి.బి సాంకేతిక కళాశాలలో ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్ అభ్య‌సించిన సుధామూర్తి ఫ‌స్ట్ క్లాస్‌లో పాస‌య్యారు. అంతేకాదు.. అప్ప‌టి కర్ణాటక ముఖ్యమంత్రి నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. అక్క‌డితోనూ ఆమె విద్యా జిజ్ఞాస ప‌రిపూర్ణం కాలేదు. తర్వాత ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు. 


స‌వాళ్ల‌ను అధిగ‌మించి.. 


తొలినాళ్ల‌లో ఉద్యోగ వేట ప్రారంభించారు. అయితే.. అప్ప‌టి రోజుల్లో 1970 - 80ల‌్లో మ‌హిళ‌లు ఇంత ఉన్న‌త చ‌దువు చ‌ద‌విన వారు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. దీనికి తోడు పురుషాధిక్య‌త ప్ర‌బ‌లి పోయిన స‌మ‌యం. దీంతో ఆమె ప్ర‌య‌త్నాలు అంత ఈజీగా అయితే ముందుకు సాగ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఆమె ప్ర‌య‌త్నించారు. ఇలా.. చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లితంగా దేశ అతిపెద్ద ఆటో పరిశ్రమ `టెల్కో`లో మొట్టమొదటి మహిళా ఇంజినీర్ గా ఉద్యోగం సాధించారు. అయితే.. ఇది కూడా తేలిక‌గా ల‌భించిన ఉద్యోగం కాదు. అప్పటికి ఈ సంస్థలో కేవలం పురుషులకే ఉద్యోగాలు ఇచ్చేవారు. పైగా ప‌నిగంట‌లు, శ్ర‌మ కూడా అధికం. అయిన‌ప్ప‌టికీ.. అక్క‌డే ఉద్యోగం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న సుధామూర్తి త‌న‌కు ఎందుకు ఉద్యోగం ఇవ్వ‌బోర‌ని ప్రశ్నిస్తూ ఆ సంస్థ చైర్మ‌న్‌కు లేఖ రాశారు. 'నేను మ‌హిళ‌ను కాబ‌ట్టే ఉద్యోగం ఇవ్వ‌రా? అయితే.. మీ మాతృమూర్తి ఎవ‌రు? మ‌హిళ కారా?' అని నిష్క‌ర్ష‌గా ప్ర‌శ్నించారు. అంతేకాదు.. 'ప్ర‌తిభ‌ను కొలిచేందుకు పురుష‌ - స్త్రీ భేదాల‌తో ప‌నిలేదు' అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌లే ఆమెను అగ్ర‌గామిగా నిల‌బెట్టాయి. వెను వెంటనే ఆమెకు ఉద్యోగం ఇస్తూ.. ఇంటికి అప్పాయింట్‌మెంట్ ఆర్డ‌ర్ వ‌చ్చింది. ఆ సంస్థలో పని చేస్తున్నపుడే సుధకు.. ఎన్.ఆర్.నారాయణ మూర్తితో పరిచయమై, ప్రేమ‌గా మారి.. తర్వాతి కాలంలో వివాహం వ‌ర‌కు దారి తీసింది. వీరికి ఒకే ఒక కుమార్తె. ఆమె కూడా పారిశ్రామిక‌వేత్తే కావ‌డం గ‌మ‌నార్హం. బ్రిట‌న్ ప్ర‌ధాని రుషి సునాక్‌.. నారాయ‌ణ మూర్తి, సుధ‌ల అల్లుడు కావ‌డం విశేషం. 


కృషితో నాస్తి.. 


కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని సుధామూర్తి నిజం చేశారు. కంప్యూటర్ ఇంజినీర్ గా జీవితాన్ని ప్రారంభించిన సుధ ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. సేవా రంగంలోనూ త‌న‌దైన ముద్ర వేశారు. పలు అనాధాశ్రమాలను ప్రారంభించి సేవ‌ చేస్తున్నారు. అలాగే గ్రామీణాభివృద్దికి సహకరిస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి, పేద విద్యార్థులకు కంప్యూటర్ జ్ఞానాన్ని చేరువ చేశారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు మెంబ‌రుగా ఉన్న కాలంలోనూ సేవ‌కే ప్రాధాన్యం ఇచ్చారు. అధికారం అడ్డు పెట్టుకుని ఆమె ఏనాడూ శ్రీవారిని అమితంగా ద‌ర్శించుకున్న‌ది లేదు. ప్ర‌స్తుతం క్యూలైన్ల‌లో ఉన్న భ‌క్తుల‌కు టీ, కాఫీ, ప్ర‌సాదాల‌తోపాటు.. వివిధ ఫ‌ల‌హారాలు అందుతున్నాయంటే.. అది ఆమె చొరవే.


రచయితగానూ..


సుధామూర్తి ప్ర‌ముఖ ర‌చ‌యిత కూడా. ఆమె ర‌చ‌న‌లు పుస్త‌కాలు, సీరియ‌ళ్ల రూపంలో వ‌చ్చిన విష‌యం చాలా త‌క్కువ మందికి తెలుసు. ఇక‌, మ‌హిళా సాధికార‌త‌కు సుధామూర్తి పెద్ద పీట వేశారు. త‌మ సంస్థ‌ల్లో అప్ర‌క‌టిత మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌ అమ‌లు చేస్తున్నారు. అంతేకాదు.. మ‌హిళ‌ల‌కే ప్ర‌త్యేకంగా క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుల‌్లో కంపెనీల‌ను ఏర్పాటు చేసి ఉపాధి క‌ల్పిస్తున్నారు. వేలాది కుటుంబాల్లో సుధా ధార‌ను వ‌ర్షిస్తున్నారు. 


సుధామూర్తిని వ‌రించిన‌ అవార్డులు


+ 2006లో పద్మశ్రీ 
+ 2007లో గౌరవ డాక్టరేటు
+ 2011లో కన్నడ పుర‌స్కారం అట్టిమబ్బే(Attimabbe) అవార్డు 
+ 2023లో పద్మ భూషణ్.


ఓ వైపు పారిశ్రామిక వేత్తగా, మరోవైపు సమాజ సేవకురాలి, రచయితగా నిత్యం శ్రమించే తత్వంతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన సుధామూర్తి నేటి తరం యువతకు ఎల్లప్పుడూ ఆదర్శమే.